Nara Lokesh: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అరెస్ట్ అయ్యారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్లో ఉన్నారు.. ఆయన బెయిల్ కోసం చేసే ప్రయత్నాలు ఫలించడంలేదు.. మరోవైపు స్కిల్ స్కామ్ తో పాటు.. ఇన్నర్ రింగ్ రోడ్ కేసు, ఫైబర్ నెట్ కేసులో కూడా చంద్రబాబు పేరును పేర్కొంది సీఐడీ.. మరోవైపు ఈ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్కు సీఐడీ నోటీసులు జారీ చేసిన విషయం విదితమే కాగా.. ఈ రోజు తాడేపల్లిలోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరుకానున్నారు లోకేష్.. ఉదయం 10 గంటలకు ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో నారా లోకేష్ ని ఏపీ సీఐడీ ప్రశ్నించనుంది.. ఈ కేసులో లోకేష్ను ఏ-14గా పేర్కొన్న సీఐడీ.. ఈ మేరకు ఏసీబీ కోర్టులో మెమో ఫైల్ చేసింది. లోకేష్ను సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద నోటీసులు ఇచ్చి ప్రశ్నించనున్నట్టు హైకోర్ట్కు సీఐడీ తెలిపింది.. అందులో భాగంగా ఈ నెల 4వ తేదీన లోకేష్ను విచారణకు రావాల్సిందిగా సీఐడీ నోటీసులు ఇచ్చింది.. హెరిటేజ్ బోర్డ్ తీర్మానాలు, అకౌంట్స్ పుస్తకాలు తీసుకురావాలని తన నోటీసుల్లో పేర్కొంది సీఐడీ.
Read Also: Navdeep: నేడు ఈడీ విచారణకు హీరో నవదీప్… లావాదేవీలపై ఆరా తీయనున్న అధికారులు
అయితే, సీఐడీ నోటీసులపై హైకోర్ట్ను ఆశ్రయించారు నారా లోకేష్.. వాదనల అనంతరం లోకేష్ను బుక్స్ కోసం వత్తిడి చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. కానీ, విచారణకు అనుమతి ఇచ్చింది.. ఇదే సమయంలో కొన్ని షరతులు కూడా పెట్టింది.. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు న్యాయవాది సమక్షంలో విచారణ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.. ఈ నెల 10వ తేదీన విచారణకు హాజరు కావాలని లోకేష్ను ఆదేశించింది హైకోర్టు.. ఇక, కోర్టు ఆదేశాల మేరకు ఈ రోజు ఉదయం 10 గంటలకు లోకేష్ విచారణకు హాజరుకాబోతున్నారు. మరోవైపు.. చంద్రబాబుపై IRR, ఫైబర్ నెట్ కేసులో సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్ పిటిషన్ల మీద నేడు ఏసీబీ కోర్టులో విచారణ సాగనుంది.. పీటీ వారెంట్ల పై తమ వాదనలు వినాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్ పై నేడు ఆదేశాలు ఇవ్వనుంది ఏసీబీ కోర్టు. చంద్రబాబు అరెస్ట్ సమయంలో నంద్యాలకు వచ్చిన సీఐడీ అధికారుల కాల్ లిస్ట్ సేకరించాలని చంద్రబాబు వేసిన పిటిషన్ పై నేడు విచారణ జరపనుంది ఏసీబీ కోర్టు.