Nara Lokesh: సీఎంకు ప్రధాని ఫోన్.. మంత్రి నారా లోకేష్‌కు కీలక బాధ్యతలు!

  • మంత్రి నారా లోకేష్‌కు కీలక బాధ్యతలు
  • తుపానుకు సంబంధించి కేంద్రంతో సమన్వయ బాధ్యతలు
  • సీఎం చంద్రబాబుకు ప్రధాని ఫోన్
Nara Lokesh Cyclone Montha

Nara Lokesh Cyclone Montha

మంత్రి నారా లోకేష్‌కు ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. మొంథా తుపానుకు సంబంధించి కేంద్రంతో సమన్వయ బాధ్యతలను లోకేష్‌కు సీఎం చంద్రబాబు అప్పగించారు. తుపానుకు సంబంధించి సీఎం చంద్రబాబు ఈరోజు ఉదయం కీలక సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా ముందు జాగ్రత్త చర్యలతో పాటు తుఫాన్ ప్రారంభం అయ్యే ముందు పరిస్థితి అంచనా వేసి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గాలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి విద్యుత్తు అంతరాయం లేకుండా చూడాలన్నారు. హోర్డింగ్స్ విషయంలో కూడా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశాలిచ్చారు.

మరోవైపు ప్రధాని మోడీ తుఫానుకు సంబంధించి సీఎం చంద్రబాబుకు ఫోన్ చేశారు. తాజా పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. కేంద్రంతో సమన్వయం చేసుకోవాలన్నారు. కేంద్ర సాయం తప్పనిసరిగా ఉంటుందని ప్రధాని చెప్పారు. ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేష్‌కు మొంథా తుపాను బాధ్యతలను సీఎం అప్పగించారు. ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి అవసరం వచ్చినా సాయం అందించాలని చెప్పారు.

Also Read: Shreyas Iyer Injury: ఐసీయూలో శ్రేయస్‌ అయ్యర్.. వారం పాటు అబ్జర్వేషన్‌లోనే!

ఆంధ్రా రాష్ట్రంపై తుఫాన్ ఎఫెక్ట్ ప్రారంభమైంది. అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు మొదలయ్యాయి. ముఖ్యంగా కాకినాడ సహా తీర ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం కాకినాడకు 570 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న మోంథా తుపాను రేపు సాయంత్రానికి తీరం దాటే అవకాశం ఉంది. ఆ సమయంలో మొత్తం 12 గంటల పాటు అత్యంత కీలకమైన సమయంగా గుర్తించి, ఆ సమయంలో ప్రజలు మరింత అప్రమత్తం గా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది. అత్యవసరైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని ప్రభుత్వం సూచించింది.