Monditoka Jaganmohan Rao: ఎన్టీఆర్ జిల్లా నందిగామ అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో వైసీపీ అభ్యర్థి మొండితోక జగన్మోహన్ రావు దూసుకుపోతున్నారు. గడపగడపకు తిరుగుతూ మరోసారి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. చందర్లపాడు మండలంలోని బొబ్బిళ్లపాడు, మునగాల పల్లె గ్రామాలలో వైసీపీ అభ్యర్థి మొండితోక జగన్మోహన్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని, మళ్లీ జగన్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన తెలిపారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మళ్లీ తనను గెలిపించాలని మొండితోక జగన్మోహన్ రావు ప్రజలను కోరారు.
ఇదిలా ఉండగా.. నందిగామ పట్టణంలో ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్తో కలిసి విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని పాల్గొన్నారు. సౌమ్య తనపై చేసిన అనుచిత వ్యాఖ్యల్ని ఖండిస్తున్నానన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇస్తే తెలుగుదేశం పార్టీలో ఉండి వైసీపీ ఎమ్మెల్యేలతో మాట్లాడటం ఏంటని ఒక ఇంటర్వ్యూలో తనపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండించారు కేశినేని నాని. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి త్వరలో తాళం వేసి ,హైదరాబాద్కు జంప్ అవుతారని, బీజేపీలో తెలుగుదేశాన్ని విలీనం చేస్తారంటూ ఎద్దేవా చేశారు. బీజేపీ చంద్రబాబును నమ్మదని, టీడీపీ, జనసేన విడుదల చేసిన మేనిఫెస్టో అంత మోసపూరితమని విమర్శించారు. అధిక మెజారిటీతో వైసీపీని గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. నందిగామ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన స్వర్గీయ దేవినేని వెంకటరమణ అడుగుజాడల్లో మొండితోక బ్రదర్స్ కొనసాగిస్తున్నారని వ్యాఖ్యానించారు.