తూర్పు గోదావరి జిల్లా అనపర్తి టిక్కెట్టు పొత్తులో భాగంగా భారతీయ జనతా పార్టీకి కేటాయించడంపై టీడీపీ శ్రేణుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. తొలి జాబితాలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టిక్కెట్ కేటాయించిన చంద్రబాబు.. ఆ తర్వాత ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇప్పుడు బీజేపీకి టికెట్ మార్పు చేయటంపై అనపర్తి టీడీపీ కార్యకర్తలు మండిపడుతున్నారు. అనపర్తి మండలం రామవరంలోని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇంటి దగ్గర ఉధృత పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ జెండాలు, కరపత్రాలు, ఎన్నికల సామాగ్రిని తెలుగుదేశం పార్టీ శ్రేణులు దగ్ధం చేశారు. అధిష్టానం నిర్ణయం వచ్చే వరకు శాంతియుతంగా ఉండాలని రామకృష్ణారెడ్డి కార్యకర్తలను సముద్రయిస్తున్నారు.
Read Also: No Tax Paid : టాక్స్ చెల్లించలేదని ప్రైవేట్ స్కూల్ కి తాళం వేసిన మున్సిపల్ అధికారులు..!
ఈ సందర్భంగా రామవరంలో హైటెన్షన్ నెలకొంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనుచరుల నిరసన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు కట్టప్ప రాజకీయాలు ఆపాలంటూ నినాదాలు చేస్తున్నారు. కోపంతో టీడీపీకి చెందిన జెండాలు, కరపత్రాలు, సైకిల్ ను మంటలో వేసి దగ్ధం చేశారు. ఇక, అనుచరులతో తన నివాసంలో నల్లమిల్లి సమావేశం అయ్యారు. కాసేపట్లో తన నిర్ణయం ప్రకటించనున్న ఆయన వెల్లడించారు. అయితే, అనపర్తి నియోజకవర్గం నుంచి రెబల్ గా పోటీ చేసే అవకాశం ఉంది.