సాధారణంగా మన సమాజంలో ఒక పెళ్లి జరగడమంటే అది కేవలం రెండు మనసుల కలయిక మాత్రమే కాదు.. రెండు కుటుంబాల పరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయం. ముఖ్యంగా తెలుగువారి పెళ్లిళ్లలో ఆర్భాటాలకు కొదవ ఉండదు. వధువు తరపు వారు పందిళ్లు, పలహారాలు, అలంకరణల కోసం లక్షలు వెచ్చిస్తే.. వరుడి వైపు వారు కూడా తమ హోదాకు తగ్గట్టుగా భారీగా ఖర్చు చేస్తారు. పెళ్లి సామాన్లు, బట్టలు, నగలు, ఫోటోగ్రఫీ, వీటన్నింటికీ మించి వేల మందికి వడ్డించే విందు భోజనాలకే సింహభాగం ఖర్చు అవుతుంది. ఒక మధ్యతరగతి పెళ్లికైనా కనీసం రూ.5 నుంచి రూ.20 లక్షల వరకు ఖర్చవుతుంది. ఇంత కష్టపడి, అప్పులు చేసి చేసే పెళ్లి.. ఒక్క క్షణంలో ఆగిపోతే ఆ కుటుంబాల పరిస్థితి వర్ణనాతీతం. సరిగ్గా ఇలాంటి హృదయవిదారక, ఉత్కంఠభరిత సంఘటన ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో చోటుచేసుకుంది.
Also Read:Sunil Gavaskar: ఆ ఇద్దర్నీ ఫైనల్ నుంచి తప్పించాల్సిందే.. సునీల్ గావస్కర్ సంచలన వ్యాఖ్యలు..
మైలవరం పరిసరాల్లోని ఒక గ్రామంలో శుక్రవారం రాత్రి పెళ్లి సందడి తారాస్థాయికి చేరింది. మంగళ వాయిద్యాల హోరు, బంధువుల కోలాహలంతో కల్యాణ మండపం కళకళలాడుతోంది. ముహూర్తం సమయానికి వధూవరులు జీలకర్ర బెల్లం కూడా పెట్టుకున్నారు. పురోహితుడు మంత్రాలు చదువుతూ.. వరుడి చేతికి మంగళసూత్రాన్ని అందిస్తున్న తరుణంలో.. ఊహించని మలుపు తిరిగింది.
Also Read:Iran Ship Attack: ఇరాన్ యుద్ధనౌక దాడిలో “విషాద కోణం”.. కమాండర్ మొండితనానికి 87 మంది బలి..
సినిమా ఫక్కీలో ఒక యువకుడు హడావుడిగా మండపం వద్దకు చేరుకున్నాడు. అతడిని చూడగానే, అప్పటివరకు మౌనంగా ఉన్న వధువు ఒక్కసారిగా పీటల మీద నుంచి లేచింది. ‘వచ్చేశావా!’ అంటూ ఆనందంతో మండపం దిగి నేరుగా ఆ యువకుడి పక్కన నిలుచుంది. ఈ అనూహ్య పరిణామంతో వరుడు, అతడి తల్లిదండ్రులు నివ్వెరపోయారు. వచ్చిన వ్యక్తి తన ప్రియుడని, తామిద్దరం గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నామని వధువు తెగేసి చెప్పడంతో పెళ్లి నిలిచిపోయింది.
Also Read:CM Revanth Reddy: ఉమెన్స్ డే వేళ భారీ శుభవార్త చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. వారందరికీ స్కూటీలు..
తమ ఒక్కగానొక్క కుమారుడి వివాహాన్ని ఎంతో వైభవంగా చేయాలని భావించిన వరుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ‘ఊరందరికీ విందు భోజనాలు ఏర్పాటు చేశాం. ఇప్పటికే రూ. 20 లక్షలు ఖర్చు చేశాం. వేల మంది భోజనం చేసి వెళ్లారు. చివరకు మా పరువు తీసి, పెళ్లి ఆపేశారు’ అంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. వధువు నిర్ణయంతో ఆగ్రహించిన కొందరు బంధువులు ప్రియుడిపై చేయి చేసుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు గొడవను సద్దుమణిగించారు. చివరకు పెద్దల సమక్షంలో జరిగిన పంచాయితీతో ఈ వివాదం ఒక కొలిక్కి వచ్చినప్పటికీ.. ఆ కుటుంబంలో జరిగిన ఆర్థిక నష్టం, పరువు నష్టం మాత్రం తీర్చలేనివి.