Telangana Municipal Elections: తెలంగాణలో ఎన్నికల పోరు షురూ అయ్యింది. రాష్ట్రంలోని 116 మునిసిపాలిటీలు, ఏడు కార్పోరేషన్ల పరిధిలోని వార్డు, డివిజన్లకు నేడు(బుధవారం) ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ షురూ అయ్యింది. సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ జరగనుంది. ఈ పోలింగ్లో మొత్తం 52,17,413 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఓటర్లలో పురుషుల(25,49,750) కంటే మహిళలే(26,67,025) అధికంగా ఉన్నారు . ఇతరులు 638 మంది ఉన్నారు. అయితే.. ఇప్పటికే 116 మునిసిపాలిటీల్లోని మొత్తం 2,582 వార్డులకు గానూ ఇప్పటికే 12 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. నారాయణపేట జిల్లాలోని మక్తల్ మున్సిపాలిటీలోని ఒక వార్డులో ఎన్నిక వాయిదా పడింది. మిగిలిన 2,569 వార్డుల్లో పోలింగ్ కొనసాగుతోంది. మున్సిపాలిటీల్లో 10,719 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఏడు కార్పోరేషన్ల పరిధిలో 414 డివిజన్లు ఉండగా రెండు చోట్ల ఏకగ్రీవమైంది. 412 స్థానాలకు నేడు పోలింగ్ జరుగుతుంది. 2225 మంది పోటీలో ఉన్నారు. మొత్తంగా 2,981 స్థానాలకు 12,944 మంది బరిలో ఉన్నట్లయింది. మునిసిపాలిటీల్లో 6017 పోలింగ్ కేంద్రాలను, కార్పోరేషన్లలో 2,174 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం సిద్ధం చేసింది. ఎన్నికల ప్రక్రియలో 41,773 మంది పోలింగ్ సిబ్బంది, 1,379 మంది రిటర్నింగ్ అధికారులు పని చేస్తున్నారు. పోలీస్ శాఖ భద్రత పరంగా అన్ని ఏర్పాట్లు చేసింది. సమస్యాత్మకమైన 8,191 పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ద్వారా నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్ఈసీ కార్యదర్శి లింగ్యా నాయక్ వెల్లడించారు.
READ MORE: Amazon Shocking Deal: రూ.38,000 ఫుట్ మసాజర్ కేవలం రూ.12,000లకే.! పాదాల నొప్పులకు ఇక చెక్.!
