Ashwini Vaishnaw: 320 కిమీ వేగం.. 12 స్టేషన్లు.. 508 కి.మీ కారిడార్.. బుల్లెట్ రైలుపై కేంద్ర మంత్రి కీలక అప్‌డేట్..

Bullet Train

Bullet Train

Ashwini Vaishnaw: భారతీయుల కలల ప్రాజెక్ట్ అయిన తొలి బులేట్ రైలు త్వరలోనే పట్టాలెక్కబోతోంది. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్ పనులు ప్రస్తుతం రికార్డు స్థాయిలో శరవేగంగా సాగుతున్నాయి. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తికరమైన అప్‌డేట్ ఇచ్చారు. పనులు ఊహించిన దానికంటే వేగంగా జరుగుతున్నాయని, వచ్చే ఏడాదినాటికి సూరత్ – బిలిమోరా మధ్య మొదటి సెక్షన్‌ను ప్రారంభించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని స్పష్టం చేశారు. అలాగే వాపీ – సూరత్ సెక్షన్ సివిల్ నిర్మాణ పనులను డిసెంబర్ 2026 నాటికి పూర్తి చేయనున్నట్లు తెలిపారు.

సుమారు 508 కిలోమీటర్ల పొడవునా విస్తరించి ఉన్న ఈ హైస్పీడ్ కారిడార్‌ను సెప్టెంబర్ 2017లో ప్రారంభించారు. ఇది మహారాష్ట్ర, గుజరాత్, దాద్రా అండ్ నాగర్ హవేలీల గుండా సాగుతుంది. ప్రయాణికుల సదుపాయం కోసం ఈ మార్గంలో ముంబై, ఠాణే, విరార్, బోయిసర్, వాపీ, బిలిమోరా, సూరత్, భరూచ్, వడోదర, ఆనంద్, అహ్మదాబాద్, సబర్కతి అనే 12 స్టేషన్లను నిర్మిస్తున్నారు. ఈ స్టేషన్ల డిజైన్లను ఆయా నగరాల స్థానిక సంస్కృతి, గుర్తింపు ప్రతిబింబించేలా, ఆధునిక ఆర్కిటెక్చర్, మల్టీమోడల్ కనెక్టివిటీతో తీర్చిదిద్దుతున్నారు.

ఇక రైలు పట్టాలపైనే కాకుండా, వాహనాల తయారీ పనులు కూడా జోరుగా సాగుతున్నాయి. టెస్టింగ్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన మొదటి కోచ్ ఇప్పటికే సిద్ధమైంది. గంటకు 320 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించే ఈ బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తే, అహ్మదాబాద్ నుంచి ముంబైకి ప్రయాణ సమయం కేవలం 2 గంటల 58 నిమిషాలకు తగ్గిపోతుంది. పూర్తి రక్షణ, మెరుగైన ప్రయాణ అనుభూతిని అందించడమే ధ్యేయంగా ప్రభుత్వం ఈ మార్గాన్ని రూపొందిస్తోంది. తాజా అంచనాల ప్రకారం ఈ కారిడార్‌లో మొదటి పూర్తి స్థాయి బుల్లెట్ రైలు సర్వీస్ ఆగస్టు 2027లో ప్రారంభం కానుంది. మొదటి దశలో భాగంగా వచ్చే ఏడాది సూరత్-బిలిమోరా లైన్, డిసెంబర్ 2026 నాటికి వాపీ-సూరత్ సివిల్ నిర్మాణ లక్ష్యాలు పూర్తయితే భారత రవాణా రంగంలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైనట్లే. ఈ మొత్తం 508 కిలోమీటర్ల కారిడార్ పూర్తిస్థాయిలో డిసెంబర్ 2029 నాటికి ప్రజలకు అందుబాటులోకి వస్తుందని రైల్వే మంత్రి తెలిపారు.