Mudragada Padmanabham: గుంటూరులో కాపు జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ముద్రగడ పద్మనాభం సంతాప సభలో ఆసక్తికర రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. ఈ కార్యక్రమానికి హాజరైన విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఆప్యాయంగా పలకరించుకోవడం సభలో ప్రత్యేకంగా నిలిచింది.
ముద్రగడ మరణం కాపు జాతికి తీరని లోటు: బోండా ఉమ
సంతాప సభలో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. ముద్రగడ పద్మనాభం మరణం కాపు జాతికి తీరని లోటని అన్నారు. కాపు సామాజిక వర్గం అభ్యున్నతి కోసం జీవితాంతం పోరాడిన నాయకుడిగా ఆయనను అభివర్ణించారు. కాపుల హక్కుల కోసం ప్రాణాలకైనా తెగించి, నుదుటిపై రివాల్వర్ పెట్టుకుని దీక్ష చేసిన వ్యక్తి ముద్రగడ అని గుర్తు చేశారు. చివరి వరకు నిజాయితీతో ప్రజల కోసం పనిచేశారని కొనియాడారు.
కాపుల సమస్యలపై ముద్రగడ చంద్రబాబు ప్రభుత్వానికి రాసిన లేఖలను అప్పట్లో పరిగణనలోకి తీసుకోవాలని తాము సూచించినప్పటికీ, కొందరు నాయకులు ఆయనకు కాపు సమాజంలో ఆదరణ లేదని చెప్పడంతో వాటిని పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు. ముద్రగడ చేపట్టిన ఉద్యమాల ప్రభావమే 2019 ఎన్నికల్లో టీడీపీ అధికారం కోల్పోవడానికి ప్రధాన కారణాల్లో ఒకటని బోండా ఉమ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కాపు సామాజిక వర్గంలో ఏర్పడిన అసంతృప్తిని గుర్తించి, వారి సమస్యలను పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ముద్రగడ లాంటి వ్యక్తిత్వం ఉన్న నాయకుడు అరుదు: అంబటి రాంబాబు
మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. వంగవీటి రంగా జీవించి ఉన్న సమయంలో విజయవాడలో జరిగిన కాపునాడు సభలో ముద్రగడ పద్మనాభం ప్రధాన ఆకర్షణగా నిలిచారని గుర్తు చేశారు. మాట ఇస్తే ప్రాణం పోయినా నిలబెట్టుకునే నాయకుడు ముద్రగడ అని కొనియాడారు. ఆయనను వేధించేందుకు కేసులు పెట్టినా తన సిద్ధాంతాలను వదులుకోలేదని అన్నారు. రాజకీయాల్లో ముద్రగడలాంటి వ్యక్తిత్వం ఉన్న నాయకుడు చాలా అరుదుగా కనిపిస్తారని వ్యాఖ్యానించారు.
వంగవీటి రంగా మరణం అనంతరం తనకు టికెట్ ఇస్తే కాపు సామాజిక వర్గం తనను గెలిపించిందని అంబటి గుర్తు చేశారు. ముద్రగడ సేవలకు గుర్తింపుగా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసి గౌరవించాలని సూచించారు. చివరగా.. “ముద్రగడ కులం మార్చుకోలేదు.. పేరు మాత్రమే మార్చుకున్నారు” అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

