MS Dhoni Retirement: మరో మూడు రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ‘ఇదే ఎంఎస్ ధోనీకి చివరి సీజన్ అవుతుందా ?’ అనే ప్రశ్న మళ్లీ మొదలైంది. గత కొన్నేళ్లుగా చాలా మంది అభిమానుల నోళ్లలో నానుతున్న ప్రశ్న ఇది. ధోనీ చివరిసారిగా భారత్ తరఫున ఆడి దాదాపు ఏడేళ్లు అయినప్పటికీ, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తరఫున తన 19వ ఐపీఎల్ సీజన్లోకి అడుగుపెట్టనున్నాడు. అయితే.. తాజాగా ధోనీ రిటైర్మెంట్పై భారత దిగ్గజ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఐపీఎల్ 2026 తర్వాత ధోనీ రిటైర్ అయ్యే అవకాశం గురించి గంగూలీ ఎలాంటి వివరాలు బయటపెట్టలేదు, కానీ సమీప భవిష్యత్తులో ఈ విషయంపై తాము చర్చించుకునే అవకాశం ఉందని సూచించారు. “ఏం చేయాలో నేను (ఎంఎస్) ధోనీకి చెబుతాను, మీడియాకు కాదు” అని గంగూలీ ఒక కార్యక్రమంలో అన్నారు.
ఇదిలా ఉండగా.. మార్చి 28న ప్రారంభమయ్యే ఐపీఎల్ 2026 ధోనీకి చివరి సీజన్ కావచ్చని, అతడి వారసుడిగా సంజు సామ్సన్ సిద్ధంగా ఉన్నాడని భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున కేవలం ‘ఇంపాక్ట్ ప్లేయర్’ గానే కొనసాగితే.. ఆ వెటరన్ రిటైర్మెంట్ గురించి ఆలోచించాలని చోప్రా అన్నారు. జియో హాట్స్టార్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆకాష్ చోప్రా మాట్లాడుతూ.. క్రికెట్ అనేది ఫుట్బాల్ లాంటిది కాదని.. ఇక్కడ డగౌట్ నుంచి జట్టును నడిపించలేరని తెలిపాడు. ధోనీకి ఉన్న అతిపెద్ద బలం మైదానంలో ఉండి ఆటను చదవగలగడం. ఆ స్పష్టత, నమ్మకమే ఆయన్ని గొప్ప నాయకుడిని చేశాయని కొనియాడారు. ఒకవేళ ఆయన కేవలం ఇంపాక్ట్ ప్లేయర్గా మాత్రమే ఆడాలనుకుంటే, ఇక రిటైర్మెంట్ ప్రకటించడం మంచిదని స్పష్టం చేశాడు. గంగూలీ, ఆకాశ్ చోప్రా వ్యాఖ్యలతో ధోనీ రిటైర్మెంట్ అంశం మరోసారి హాట్టాపిక్గా మారింది.
READ MORE: Ram Pothineni New Movie: రామ్ పోతినేని నెక్స్ట్ మూవీ ఫిక్స్.. ఊహించని డైరెక్టర్?
