MP Margani Bharat: చిలకలూరిపేటలో జరిగిన టీడీపీ-జనసేన-బీజేపీ ఉమ్మడి బహిరంగసభపై సెటైర్లు వేశారు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్.. నిన్న సభలో చంద్రబాబు ప్రత్యేక హోదాను ఎందుకు అడగలేదు ? అని ప్రశ్నించిన ఆయన.. నిన్న చిలకలూరిపేటలో జరిగిన సభ ఫ్లాప్ అయ్యిందన్నారు.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభలో మైకులు పనిచేయలేదు.. అంటే.. పరిస్థితులు, దేవుడు వారి పక్షాన లేడని వ్యాఖ్యానించారు. ఇక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసింది బీజేపీ అని దుయ్యబట్టారు.. టీడీపీ, బీజేపీ, జనసేన కలయిక అక్రమ కలయికగా మండిపడ్డారు.. గతంలో చంద్రబాబు.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని చాలా అనరాని మాటలు అన్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్లు కలిసి రాష్ట్రాన్ని నరేంద్ర మోడీకి తాకట్టు పెట్టాలనుకుంటున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం సహాయం చేశారని ఎన్డీఏలో కలుస్తున్నారు? అని ప్రశ్నించారు ఎంపీ మార్గాని.. విలువలు విశ్వసనీయత అనే పదాలు చంద్రబాబు జీవితంలో తెలుసుకోలేరన్న ఆయన.. పవన్ కల్యాణ్, చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఆలోచించే వ్యక్తులు కాదన్నారు. పార్లమెంట్లో పాస్ అయిన బిల్లులకు కూడా ఈ రోజుకి అతిగతి లేదన్నారు. విభజన హామీలను ఇంకా అమలు చేయలేదన్నారు. మోసం చేయడం అనేది చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యగా విమర్శించారు. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి ఇంటికి పెద్ద కొడుకు లాగా వ్యవహరిస్తున్నారు.. రాజమండ్రిలో గంజాయి బ్యాచ్ కి డాన్ ఆదిరెడ్డి శ్రీనివాస్ అని ఆరోపించారు. అధిక వడ్డీలతో పేదవాళ్లు స్థలాలు లాక్కున్న చరిత్ర ఆదిరెడ్డి కుటుంబానిదని దుయ్యబట్టారు.. నా గురించి మాట్లాడే అర్హత నీకు లేదన్నారు. రాజమండ్రిలో గంజాయి బ్లేడు బ్యాచ్లు నడుస్తున్నరాయంటే.. దానికి కారణం ఆదిరెడ్డి కుటుంబమే నంటూ సంచలన ఆరోపణలు చేశారు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్.