Mohammed Shami slams Mitchell Marsh: వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ మ్యాచ్లో భారత్పై విజయం సాధించాక ఆస్ట్రేలియా ఆటగాళ్ల సెలబ్రేషన్కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ముఖ్యంగా ఆసీస్ ఆల్రౌండర్ మిచెల్ మార్ష్.. ట్రోఫీ మీద కాళ్లు పెట్టిన ఫొటో చర్చనీయాంశమైంది. మార్ష్పై క్రికెట్ అభిమానులు తీవ్రంగా విరుచుకుపడ్డారు. పలువురు మాజీలు సైతం మార్ష్ ప్రవర్తనను తప్పుబడుతున్నారు. తాజాగా టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ కూడా మార్ష్ తీరుపై విచారం వ్యక్తం చేశాడు.
మిచెల్ మార్ష్ వ్యవహరించిన తీరు తనకు ఏ మాత్రం నచ్చలేదని మహ్మద్ షమీ పేర్కొన్నాడు. ‘వన్డే ప్రపంచకప్ ట్రోఫీ మీద మిచెల్ మార్ష్ కాళ్లు పెట్టిన ఫోటో చూసి నేను చాలా బాధపడ్డాను. ప్రతి జట్టు పోటీపడే ట్రోఫీ అది. అందరూ సాధించాలని కలలు కనే ట్రోఫీ మీద కాళ్లు పెట్టడం నాకు సంతోషాన్ని కలిగించలేదు’ అని షమీ అన్నాడు. ప్రపంచకప్ 2023లో షమీ అద్భుత ప్రదర్శన చేశాడు. 24 వికెట్లు తీసిన షమీ.. టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. మూడుసార్లు ఐదు వికెట్లు తీసిన అతడు.. ఓసారి నాలుగు వికెట్ల ప్రదర్శన చేశాడు.
Also Read: EV Charging Stations: చార్జ్జోన్తో ఎంజీ మోటార్ టై అప్.. పలు ప్రదేశాలలో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు!
స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా గాయం కారణంగా జట్టుకు దూరమైన తరుణంలో తుది జట్టులో మహ్మద్ షమీ చోటు దక్కించుకున్నాడు. లీగ్ దశలో తొలుత న్యూజిలాండ్పై ఫైవ్ వికెట్ల హాల్ నమోదు చేశాడు. ఆ తర్వాత ఇంగ్లండ్పై నాలుగు వికెట్లు తీసిన షమీ.. శ్రీలంకపై ఐదు వికెట్స్ పడగొట్టాడు. ఆ తర్వాత దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో రెండు వికెట్లు తీసిన షమీ.. సెమీ ఫైనల్లో న్యూజిలాండ్పై ఏడు వికెట్లు పడగొట్టాడు. ఇక ఆస్ట్రేలియాతో అహ్మదాబాద్లో జరిగిన ఫైనల్లో ఒక వికెట్ తీసి నిరాశపరిచాడు.