NTV Telugu Site icon

MLA Purchasing Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. నాంపల్లి కోర్టులో ముగిసిన వాదనలు

Mla

Mla

MLA Purchasing Case: తెలంగాణలో నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుల బెయిల్ పిటిషన్ పై నాంపల్లి ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. బెయిల్ పై కోర్టు తీర్పును సోమవారానికి వాయిదా వేసింది. విచారణ సందర్భంగా ఈ కేసు ఏసీబీ పరిధిలోకి రాదని పిటిషనర్ల తరఫు లాయర్లు వాదనలు వినిపించారు. ఫిర్యాదు చేయడానికి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి అర్హత లేదని కోర్టుకు తెలిపారు. వెంటనే ముగ్గురికి బెయిల్ మంజూరు చేయాలని కోరారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పైలెట్ రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, బీరం హర్షవర్ధన్ రెడ్డికి వంద కోట్లు ఇస్తామ‌ని ప్రలోభాలకు గురిచేశారన్న ఆరోపణలపై రామచంద్రభారతి, నందు, సింహయాజి అనే ముగ్గురు వ్యక్తులను సాక్ష్యాలతో పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీం(సిట్‌) విచార‌ణ‌కు రెండ్రోజుల క‌స్టడీకి కోర్టు అనుమతినిచ్చింది. కాగా, ఇవ్వాళ్టితో వీరి క‌స్టడీ ముగియ‌గా.. నిందితులు ప్రస్తుతం చంచల్ గూడ జైలులో ఉన్నారు. ముగ్గురు నిందితుల నుంచి వాయిస్ శాంపిల్స్ సేకరించినట్టు తెలుస్తోంది. బేరసారాల వీడియోలో వాయిస్ ను, తాజాగా సేకరించిన వాయిస్ తో పోల్చిచూడనున్నారు. కోర్టు అనుమతితో ఏసీబీ అధికారులు తొలుత ఈ ముగ్గురిని వేర్వేరుగా విచారించారు. అనంతరం, ముగ్గురిని కలిపి ఒకేసారి విచారించారు. వేర్వేరుగా ప్రశ్నించిన సమయంలో ముగ్గురు వేర్వేరు సమాధానాలు ఇచ్చినట్లు తెలిసింది.