తెలంగాణలో కాంగ్రెస్పార్టీ నేతలు ఏఐసీసీ ఆదేశాల మేరకు 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆజాద్ కా గౌరవ్ పేరిట పాదయాత్ర నియోజకవర్గాల్లో పాదయాత్ర నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలోనే సంగారెడ్డి జిల్లాలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ 70 ఏళ్లలో కాంగ్రెస్ దేశ ప్రజల కోసం అనేక వసతులు,ఉపాధి,నీళ్లు, కరెంట్, రోడ్లు ,విద్య, వైద్యంలో అనేకం తీసుకొచ్చిందన్నారు. నిన్న మొన్న పుట్టిన వాళ్ళు కాంగ్రెస్ ఏంచేసిందని మాట్లాడుతారని, కేసీఆర్,కేటీఆర్,హరీష్ రావు, బండి సంజయ్ 70 ఏళ్లలో కాంగ్రెస్ చేసిందేమీ లేదని అంటుంటారని, ఇంత పెద్ద దేశంలో డెమోక్రసీ ని, ఎన్నో వ్యవస్థలను తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీయే కదా అని ఆయన ప్రశ్నించారు.
ఈ రోజు చిన్న చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ చూపెట్టి సోనియా, రాహుల్ గాంధీ ల పై ఈడీ కేసులు పెడుతుంది బీజేపీ ప్రభుత్వమని ఆయన మండిపడ్డారు. ఉద్యమ సమయంలో మోడీ,అమిత్ షా, కేసీఆర్,కేటీఆర్,హరీష్ రావు,బండి సంజయ్ ఎవరు పుట్టలేదు కదా అని, రాష్ట్రం కావాలి అంటే సోనియమ్మ రాష్ట్రం ఇచ్చిందని, ఇచ్చిన రాష్ట్రంలో మీరే హీరోలు అయ్యారు కదా..! అని ఆయన వ్యాఖ్యానించారు. ఇంత చేసిన ఇంకా కాంగ్రెస్ ఏం చేసిందని ఊరికే అంటుంటారని, బండి సంజయ్ కి రాజకీయాల్లో తూ తెలీదు తా తెలీదంటూ జగ్గారెడ్డి విమర్శించారు. మోడీ పుట్టింది 1952 లో.. స్వతంత్రం వచ్చింది 1947 లో అంటే స్వతంత్ర వచ్చాక మోడీ పుట్టి ఆ ఫలాలను అనుభవిస్తున్నాడని ఆయన అన్నారు.