MLA Bonda Uma meets CM Chandrababu: విజయవాడ మేయర్ పీఠంకు సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. తన కుమారుడు సిద్ధార్థకు విజయవాడ మేయర్గా అవకాశం కల్పించాలని ఎమ్మెల్యే బోండా సీఎంను కోరారు. గురువారం సచివాలయంకు తన కుమారుడు సిద్ధార్థతో కలిసి వెళ్లిన ఎమ్మెల్యే బోండా.. సీఎం చంద్రబాబును కలిసి మేయర్ అభ్యర్థిత్వంపై విజ్ఞప్తి చేశారు.
సిద్ధార్థ బయోడేటాను సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అందజేశారు. మేయర్ పదవికి తన కుమారుడికి ఉన్న అర్హతలు, సామర్థ్యాలను వివరించారు. విజయవాడ నగర మేయర్ పదవికి సిద్ధార్థ అన్ని విధాలా అర్హుడని బోండా ఉమా సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఆయన అభ్యర్థిత్వాన్ని పరిశీలించి అవకాశం కల్పించాలని చంద్రబాబును కోరారు. విజయవాడ పరిధిలోని మూడు నియోజకవర్గాల్లోనూ సిద్ధార్థకు మంచి పరిచయాలు ఉన్నాయని.. పార్టీ కార్యకర్తలు, యువతతో నిరంతరం మమేకమవుతూ రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్నారని వివరించినట్లు సమాచారం. అలానే విజయవాడకు ప్రభుత్వం ఇవ్వాల్సిన ప్రాధాన్యత, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు.. వంటి అంశాలను సీఎంకు బోండా చెప్పినట్లు తెలిసింది.
ఎమ్మెల్యే బోండా ఉమా విజ్ఞప్తిపై సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. మేయర్ ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ తర్వాత అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. మేయర్ పదవికి సంబంధించి పార్టీ అధిష్ఠానం నిర్ణయం కీలకం కానుండగా.. బోండా ఉమా నేరుగా సీఎంని కలిసి తన కుమారుడి అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించడం విజయవాడ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పార్టీ నిర్ణయం ఎలా ఉండబోతుందన్న దానిపై ఇప్పుడు అందరిలో ఆసక్తి నెలకొంది.

