గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై అధికారులతో మంత్రి తలసాని సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మేయర్ విజయలక్ష్మి, సీపీ అంజనికుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. దేశంలోనే హైదరాబాద్ లో జరిగే వేడుకలు ప్రత్యేకమని… అన్ని శాఖలు నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లు చేశాయన్నారు. ఎవ్వరికీ ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని.. దాదాపు 40 కి పైగా క్రేన్స్ ట్యాంక్ బండ్ లో ఏర్పాటు చేసామని తెలిపారు. 19 వేల మంది పోలీస్ సిబ్బంది బందోబస్తులో పాల్గొంటారని.. హైదరాబాద్ పరిధిలో 12 వేల మంది సిబ్బంది నిమజ్జన విధుల్లో పాల్గొంటారన్నారు. 25 బేబీ పాండ్స్ కూడా ఏర్పాటు చేసాం, వాటిలో కూడా నిమజ్జనం జరుగుతుందన్నారు. ఉత్సవ కమిటీలు, ప్రజలు.. అధికారులకు సహకరించాలని… ఘనంగా నిమజ్జనం జరుపుకుంటామని వెల్లడించారు.