తెలంగాణలో ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ సమస్యలపై రాజకీయ సెగలు రాజుకుంటూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై మంత్రి సీతక్క తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పదేళ్ల నిరంకుశ పాలనలో బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగులను నిలువునా ముంచిందని, యువత జీవితాలతో ఆడుకుందని ఆమె ఆరోపించారు. ఒకప్పుడు నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో ఏర్పడిన రాష్ట్రంలో, గత ప్రభుత్వం కేవలం స్వలాభం కోసమే పనిచేసిందని విమర్శించారు. పదేళ్ల సుదీర్ఘ కాలంలో బీఆర్ఎస్ కనీసం లక్ష ఉద్యోగాలను కూడా భర్తీ చేయలేకపోయిందని, నోటిఫికేషన్ల పేరిట కాలయాపన చేస్తూ నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లిందని మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఉపాధి అవకాశాలను కూడా తెలంగాణ సిద్ధించిన తర్వాత యువతకు దక్కకుండా చేశారని దుయ్యబట్టారు.
అయితే.. తమ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నిరుద్యోగుల సంక్షేమానికే ప్రథమ ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. కేవలం కొద్ది నెలల వ్యవధిలోనే పారదర్శకంగా, ఎక్కడా కోర్టు వివాదాలు లేకుండా ఇప్పటికే 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగుల ఇళ్లలో వెలుగులు నింపామని ఆమె వెల్లడించారు. ఇచ్చిన మాట ప్రకారం యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
భవిష్యత్తులో కూడా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుందని, దీనిలో భాగంగానే త్వరలోనే మరో 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సరికొత్త నోటిఫికేషన్లను విడుదల చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని ప్రకటించారు. నిరుద్యోగులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా ప్రణాళికాబద్ధంగా ఉద్యోగాల విప్లవాన్ని ముందుకు తీసుకెళ్తామని మంత్రి సీతక్క భరోసా ఇచ్చారు. ప్రతిపక్షాల అసత్య ప్రచారాలను నిరుద్యోగ యువత నమ్మవద్దని, ప్రభుత్వంపై నమ్మకంతో పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని ఆమె పిలుపునిచ్చారు.

