NTV Telugu Site icon

Seediri Appalaraju: సలహాలు ఇచ్చేది పోయి విషం చిమ్ముతావా.. చంద్రబాబుపై మంత్రి ఫైర్

Appalaraju

Appalaraju

Seediri Appalaraju: టీడీపీ ఇండస్ట్రీస్ ఫ్యాక్ట్ చెక్ అనే బుక్ రిలీజ్ చేసిందని ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. వైజాగ్‌లో రేపు సమ్మిట్ జరుగుతున్న గొప్ప సందర్బంలో ప్రజలను తప్పుదారి పట్టించేలా ఫాల్స్ బుక్ లెట్స్ ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. సత్యం రామలింగ రాజు,కోనేరు ప్రసాద్, నిమ్మగడ్డ ప్రసాద్ ను వేధించామంటున్నారు.. వారికి మాకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలోనే కదా వారిని వేధించారని ఆరోపించారు. మా మనిషి ముఖ్యమంత్రిగా లేరు కాబట్టి అబద్దాలు ప్రచారం చేస్తాం అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు.

అదానీ లాంటి వ్యక్తి లక్షల కోట్ల పెట్టుబడులు పెడుతున్నారని ఆయన వెల్లడించారు. అంబానీ, టాటా, బిర్లా, జిందాల్ వంటి వారు రాష్ట్రం వైపు చూస్తున్నారన్నారు. రిలయన్స్‌ని వెనక్కి పంపామంటున్నారు.. చంద్రబాబు హయాంలో లిటిగేషన్ ఉన్న ల్యాండ్‌ని రిలయన్స్‌కి కేటాయించారని .. అందుకే కోర్టు కేసులతో ఇబ్బందులు పడి రిలయన్స్ వెనక్కి వెళ్లిందన్నారు. ఇది మీ తప్పిదం కాదా అంటూ మంత్రి ప్రశ్నించారు. లూలూ గ్రూప్‌కి ప్రైం లొకేషన్‌లో స్థలం కేటాయించారు. 2017లో ఇచ్చినా 2019 వరకు కనీసం లీజ్ కట్ట లేదు.. వారే వెనక్కి వెళ్లారని మంత్రి చెప్పారు. జాకీ సైతం మాకు మార్కెట్ లేదంటూ వెనక్కి తగ్గారు.. చంద్రబాబు హయాంలోనే లేఖ రాసి వెళ్లిపోయారన్నారు. అమర్ రాజా వారు ఏపీలోనే పెట్టుబడి పెట్టాలని రూల్ ఉందా.. విస్తరణలో భాగంగా నే తెలంగాణకు వెళ్లారని తెలిపారు. ఏపీలో ప్లాంట్‌కు కూడా అమర్‌రాజా పెట్టుబడులు పెడుతోందన్నారు.

Read Also: Global Investors Summit: గ్లోబల్ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌కు సర్వం సిద్ధం.. ఘనంగా ఏర్పాట్లు

అమర్‌రాజా కంపెనీ లెడ్ వల్ల ప్రజలకు ఇబ్బందులు అని పీసీబీ నోటీస్ ఇస్తే.. మేం ఇబ్బందులకు గురి చేసారంటారా అంటూ మండిపడ్డారు. అన్ని అబద్దాలు ప్రచారం చేస్తున్నారన్నారు. ఇన్ఫోసిస్ తన క్యాంపస్‌ను మొదలుపెడుతోందని, అనేక దిగ్గజ కంపెనీలు విశాఖ కేంద్రంగా వస్తున్నాయన్నారు. ఏడు నెలల్లో 40 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని కేంద్రం స్వయంగా చెప్పిందన్నారు. ఎగుమతుల్లో 4వ ర్యాంక్‌లో ఉన్నామన్నారు. చంద్రబాబు హయాంలో పారిశ్రామిక బకాయిలను సైతం 3675 కోట్లు మేం చెల్లించామని , తిరిగి పారిశ్రామిక రాయితీ ఇచ్చామన్నారు. విపత్కర పరిస్థితులను తట్టుకుని 11.4% గ్రోత్ జగన్ పరిపాలనతో సాధ్యమైందన్నారు. 108 భారీ పరిశ్రమలు మా హయాంలో వచ్చాయన్నారు.

ఏపీకి ప్రత్యేక హోదా వచ్చి ఉండుంటే.. పరిస్థితి ఇలా ఉండేది కాదన్నారు. సలహాలు ఇచ్చేది పోయి విషం చిమ్ముతావా అంటూ చంద్రబాబుపై మంత్రి అప్పలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పోతే తప్ప రాష్ట్రం దరిద్రం పోదు అని ప్రజలు అనుకుంటున్నారని ఆయన అన్నారు. 4వారాల్లో భావనపాడు పోర్టుకు సీఎం జగన్‌ శంకుస్థాపన చేస్తారని మంత్రి తెలిపారు. భావనపాడు-మూలపేట పోర్టుతో శ్రీకాకుళం దశ మారుతుందన్నారు. మెడలు వంచించుకునే స్థితిలో బీజేపి లేదన్న మంత్రి.. మేం మాటతప్పాం అనే నైతిక బాద్యత వహించే స్థితిలో కూడా బీజేపీ లేదన్నారు. చంద్రబాబు ఏ ఓక్క సమయంలో కూడా హోదా గురించి అడగలేదని మంత్రి మండిపడ్డారు. ఐప్యాక్ మాకు సలహాదారు అని ఓపెన్‌గా చెప్పామన్న మంత్రి … ఐప్యాక్ పార్టీలో భాగమన్నారు. రోడ్లు ఏవి వేయాలో ఐప్యాక్ ఎలా డిసైడ్ చేస్తుంది.. ఇది అసత్య ప్రచారమని మంత్రి సీదిరి అప్పలరాజు స్పష్టం చేశారు.