మార్చి 2వ తేదీ నుండి ప్రారంభమయ్యే రంజాన్ మాసంలో చేయాల్సిన ఏర్పాట్ల పై డా. బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రంజాన్ మాసంలో తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా.. జీహెచ్ఎంసీ రంజాన్ నెలలో నగరంలో పరిశుభ్రత విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి తెలిపారు. మసీదు, ఈద్గాల వద్ద ప్రత్యేక శానిటేషన్ బృందాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. వీధి దీపాలు మరమత్తులు, తాత్కాలిక లైట్లు ఏర్పాటు చేస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ చెప్పారు. అలాగే.. రోడ్ల మరమత్తులు పూర్తి చేస్తామని వెల్లడించారు. మక్కా మసీద్, రాయల్ మాస్క్, మిరాలం ఈద్గా వద్ద ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తున్నామని పేర్కొన్నారు. రాత్రి సమయంలో దోమల నివారణకు జీహెచ్ఎంసీ ఎంటమాలజీ టీం ద్వారా ఫాగింగ్ చేస్తున్నట్లు తెలిపారు. అన్ని డిపార్ట్మెంట్స్ కలిపి ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ప్రత్యేక అధికారులను నియమించి సమన్వయం చేస్తున్నామని జీహెచ్ఎంసీ కమిషనర్ తెలిపారు.
మసీదులు, ఈద్గాల వద్ద వాటర్ ప్యాకెట్స్ ఏర్పాటు, తాగునీటి అవసరాల దృష్ట్యా ప్రత్యేక ట్యాంకర్లు ఏర్పాటు.. మసీదులకు వెళ్లే దారిలో డ్రైనేజీల రిపేర్ పూర్తి చేస్తున్నామని వాటర్ వర్క్స్ ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు. వేసవికాలం దృష్ట్యా విద్యుత్ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో రంజాన్ నెలలో మొబైల్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. డిమాండ్ తగ్గ సప్లై ఉండేలా ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. మసీదుల వద్ద ఈద్గాల వద్ద విద్యుత్ ఎమర్జెన్సీ సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మసీదుల వద్ద టెంట్లు ఏర్పాటు చేయడంతో పాటు క్యూలైన్ల కోసం బారికేట్లు ఏర్పాటు చేయడానికి ఆర్అండ్బీ విభాగం సిద్ధంగా ఉందని అధికారులు పేర్కొన్నారు. రంజాన్ నెల నేపథ్యంలో ప్రజలకు పాల ఇబ్బందులు లేకుండా ఉండడానికి అవసరాలకు తగిన పాలను సరఫరా చేస్తామని డైరీ అధికారులు తెలిపారు. ముస్లిం ఉద్యోగులకు సాయంత్రం నాలుగు గంటలకే విధులు ముగించేలా ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశామని జేఏడీ అధికారులు మంత్రి పొన్నం ప్రభాకర్కు తెలిపారు.
Read Also: Russia-Ukraine war: మొదలైన శాంతి చర్చలు.. ఉక్రెయిన్ లేకుండానే చర్చలు
రంజాన్ పండగ దృష్ట్యా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా షాపింగ్ చేసుకోవడానికి ట్రాఫిక్ను నియంత్రిస్తూ అర్ధరాత్రి వరకు వీధి వ్యాపారాలు కొనసాగించడానికి అనుమతించాలని పోలీస్ అధికారులను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విజ్ఞప్తి చేశారు. రంజాన్ పండుగ దృష్ట్యా ట్రాఫిక్ పేరుతో ఇబ్బందులు కలిగించకూడదని కోరారు. పండగ రోజు ట్రాఫిక్ మళ్లింపులపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. పండగ దృష్ట్యా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వైద్య అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని.. ఈద్గాలు, మసీదుల వద్ద హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలని.. నిరంతరం వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. రంజాన్ నెలలో ముస్లిం సోదరులకు పండగ నిర్వహించుకోవడానికి సమయానికి రేషన్ అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సివిల్ సప్లై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.