NTV Telugu Site icon

Kuwait: కువైట్ అగ్ని ప్రమాద ఘటన.. మృతదేహాలను ఇండియాకు తీసుకొచ్చేందుకు సిద్ధం

Kuwait

Kuwait

కువైట్ లోని దక్షిణ నగరమైన మంగాఫ్ లోని 196 మంది వలస కార్మికులు నివసిస్తున్న 7 అంతస్తుల భవనంలో బుధవారం ఉదయం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 45 మంది భారతీయులు మరణించారు. కాగా.. 45 మంది భారతీయుల మృతదేహాలకు డీఎన్ఏ పరీక్ష నిర్వహించినట్లు కువైట్ అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం తర్వాత.. అగ్ని ప్రమాదంలో గాయపడిన భారతీయులకు సహాయం చేయడానికి, మృతదేహాలను భారతదేశానికి తీసుకురావడానికి విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ కువైట్ చేరుకున్నారు. భారతీయుల మృతదేహాలను ఇండియా తీసుకురావడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం సిద్ధంగా ఉందని తెలిపారు.

Puri Jagannath Temple: తెరుచుకున్న జగన్నాధుడి ద్వారాలు.. ఆనందంలో భక్తులు..

కువైట్ విదేశాంగ మంత్రి అబ్దుల్లా అలీ అల్-యాహ్యాను కీర్తి వర్ధన్ సింగ్ కలిశారు. వైద్య సహాయం, భారతీయుల మృతదేహాలను వీలైనంత త్వరగా ఇండియాకు తరలించాలని కోరారు. మరోవైపు.. ఈ ఘటనపై దర్యాప్తుతో సహా పూర్తి సహాయాన్ని అల్-యాహ్యా హామీ ఇచ్చారని కువైట్ లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. ఈ విషాద ఘటనపై విదేశాంగ మంత్రి యాహ్యా సంతాపాన్ని వ్యక్తం చేసినట్లు రాయబార కార్యాలయం తెలిపింది. మరోవైపు.. కువైట్ లోని సంబంధిత అధికారులందరూ అందిస్తున్న సహకారాన్ని విదేశాంగ శాఖ సహాయ మంత్రి అభినందించారని రాయబార కార్యాలయం తెలిపింది. అలాగే.. గాయపడిన ఏడుగురు భారతీయులు చేరిన ముబారక్ అలీ కబీర్ ఆసుపత్రిని కీర్తి వర్ధన్ సింగ్ సందర్శించారు. భారత ప్రభుత్వం నుండి సాధ్యమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని బాధితులకు హామీ ఇచ్చారు.

Pawan Kalyan: జనసైనికులకు పవన్‌ కల్యాణ్‌ విజ్ఞప్తి.. 20 తర్వాత నేనే కలుస్తా..

కాగా.. ఈ ఘటనలో 48 మృతదేహాలను గుర్తించామని, అందులో 45 మంది భారతీయులు.. ముగ్గురు ఫిలిపినోలు ఉన్నారని కువైట్ మొదటి ఉప ప్రధాన మంత్రి, రక్షణ మంత్రి షేక్ ఫహద్ అల్-యూసెఫ్ అల్-సబా చెప్పారు. మిగిలిన ఒక మృతదేహాన్ని గుర్తించే ప్రయత్నాలు ఇంకా కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన భారతీయుల్లో ఎక్కువ మంది కేరళకు చెందిన వారేనని తెలిపారు. కువైట్ అగ్నిప్రమాద ఘటనపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, ఎన్‌ఎస్‌ఎ అజిత్ దోవల్, విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా, ప్రధాని ప్రిన్సిపల్ సెక్రటరీ పికె మిశ్రా తదితరులతో జరిగిన సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ పరిస్థితిని సమీక్షించారు. మరణించిన భారతీయ పౌరుల కుటుంబాలకు ప్రధానమంత్రి సహాయ నిధి నుండి రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా మొత్తాన్ని ప్రధాని మోడీ ప్రకటించారు. అంతేకాకుండా.. ప్రభుత్వం అన్ని విధాలా సహాయాన్ని అందిస్తుందని తెలిపారు.