రైతుల పేరిట రాజకీయం వద్దని, నాలుగేళ్లలో కాంగ్రెస్ ఎంపీలు ఎన్ని సమస్యల మీద ఎన్ని దీక్షలు చేశారన్నారు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. అకాలవర్షాలకు పంటనష్టంపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేఖపై స్పందించిన మంత్రి నిరంజన్ రెడ్డి… అకాలవర్షాల గురించి నాలుగు రోజుల ముందు నుంచే ప్రభుత్వం అప్రమత్తం చేస్తున్నదని, అకాలవర్షాలు కురిసిన 24 గంటలలోపే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు వికారాబాద్ జిల్లాలో పర్యటించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో దెబ్బతిన్న పంటలను అంచనా వేయాలని వ్యవసాయ శాఖను ఆదేశించడం జరిగిందని, వివిధ ప్రాంతాల్లో ఆయా నియోజకవర్గాల శాసనసభ్యులు పంట నష్టం జరిగిన వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి రైతులకు భరోసా కల్పిస్తున్నారన్నారు.
Also Read : Indigo Flight : ఇండిగో విమానానికి తప్పిన ముప్పు
కేవలం రాజకీయ ప్రయోజనాల కొరకు చేసే రాజకీయ దీక్షలను రైతులు గమనిస్తారని, సమస్యను ప్రభుత్వం దృష్టికి ఒక ప్రజాప్రతినిధిగా కోమటిరెడ్డి గాని మరొకరు గాని తీసుకురావడం తమ బాధ్యత అన్నారు. కానీ రాజకీయ దురుద్దేశాలతో ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే అలోచన సబబు కాదని ఆయన హితవు పలికారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు, వ్యవసాయానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి వ్యవసాయ అనుకూల విధానాలతో దేశంలోనే అగ్రగామిగా సాగుతున్నదని, ప్రభుత్వ చర్యల మూలంగా ఈ యాసంగిలో 56.44 లక్షల ఎకరాలలో వరి సాగవుతున్నదని, రైతుబంధు, రైతుభీమా, ఉచితకరంటు, సాగునీటి కల్పనతో రైతులలో ఆత్మవిశ్వాసం పెరిగిందన్నారు.
Also Read : Telangana: చైల్డ్ పోర్న్ చూస్తే జైలుపాలే.. తెలంగాణ పోలీసుల హెచ్చరిక
ప్రతి ఏటా వ్యవసాయ ఉత్పత్తులు పెరుగుతున్నాయని, దేశంలో సగటు ఉత్పత్తిలో ప్రథమ స్థాయిలో ఉన్నామన్నారు. తెలంగాణ వరి ధాన్యం కొనమని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెబితే ఒక్క కాంగ్రెస్ నేత ఎందుకు ప్రశ్నించలేదు ? ఎందుకు దీక్షలు చేయలేదు ? అని ఆయన ప్రశ్నించారు. అకాలవర్షాలతో వచ్చిన పంటనష్టం మీద రాజకీయం చేయడం దురదృష్టకరం. మీ గత పాలనలో రైతుల పడ్డ గోస గుర్తు చేసుకోండని ఆయన అన్నారు.