NTV Telugu Site icon

Minister Nara Lokesh: ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన!

Nara Lokesh

Nara Lokesh

Minister Nara Lokesh: రాష్ట్రంలో జరిగిన భూ కుంభకోణాలపై సిసోడియా నివేదికపై వచ్చే కేబినెట్‌లో చర్చించి లెక్కలన్నీ బయటపెడతామని, అక్రమాలకు బాధ్యులైన అందరి పైనా చర్యలు ఉంటాయని మంత్రి నారా లోకేష్ తెలిపారు. వైసీపీ పాలనలో విశాఖలో రాజారెడ్డి రాజ్యంగా అమలైందని ఆయన ఆరోపించారు. బెదిరించి భూముల దోపిడీ చేశారని.. ఆ క్రమంలో నేరాలు జరిగాయన్నారు.విశాఖ పట్టణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు కేంద్రంగా మారుస్తామని మంత్రి పేర్కొన్నారు. ఆ దిశగా పెట్టుబడిదారులతో చర్చిస్తున్నామన్నారు. ఎన్డీఏకు ప్రజాక్షేత్రంలో మంచి తీర్పు వచ్చింది…ఇక కోర్టులో తీర్పు పెండింగ్‌లో ఉందన్నారు. ఓ పత్రిక తనపై తప్పుడు కథనాలు ప్రచురించిందని.. తప్పు చేసినట్టు ఆ పత్రిక ఒప్పుకోలేదని.. అందుకే 75కోట్లకు పరువు నష్టం దావా వేశానన్నారు.

Read Also: AP Pensions: పింఛన్‌దారులకు శుభవార్త.. ఈ నెల 31నే పింఛన్లు

ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో పాత విధానం అమలు చేస్తామని.. సెప్టెంబర్ 11న ముఖ్యమంత్రి సమక్షంలో ఫేజ్ రీయింబర్స్‌మెంట్ అమలు మీద నిర్ణయం తీసుకుంటామన్నారు. అధికారం టీడీపీకి కొత్త కాదని.. తాను ఎప్పుడూ మంత్రిగా ఉన్నా ఖర్చులు అన్నీ తన సొంత డబ్బుతోనే పెడతానన్నారు. ప్రభుత్వం ఖర్చుతో కప్పు కాఫీ కూడా తాను తాగలేదన్నారు. జగన్మోహన్‌ రెడ్డి లాగా తనకు ప్రజాధనం లూటీ చేయడం రాదని మంత్రి ఆరోపించారు. రుషికొండ, సర్వేరాళ్ల కోసం వందల కోట్లు దుర్వినియోగం చేశారని విమర్శించారు. రెడ్ బుక్‌ను ఖచ్చితంగా ఫాలో అవుతానని ముందే చెప్పానన్నారు. ఏ అధికారులు చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళను వదిలిపెట్టనని చెప్పానని.. తప్పు చేయని వాళ్ళు ఎందుకు భయపడాలని ప్రశ్నించారు.

Read Also: Andhra Pradesh: మద్యం పాలసీ రూపకల్పనకు కేబినెట్ సబ్ కమిటీ నియామకం

సినీనటికి వేధింపులు వ్యవహారం బయటకు వచ్చిందని.. ఎంత దుర్మార్గంగా వ్యవహరించారో ఆ నటి వేదన చూస్తే అర్థం అవుతోందన్నారు.వాటిలో అధికారుల ప్రమేయం బయటకు వస్తుంది.. వాటి అన్నింటి మీద విచారణ జరగాలన్నారు. గత ప్రభుత్వ విధానాల వల్ల స్కూలుకు వెళ్లే విద్యార్థుల సంఖ్య 35 లక్షలకు పడిపోయిందని ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వం విద్యావ్యవస్థలో తీసుకున్న నిర్ణయాలను సమీక్షిస్తున్నామన్నారు.నాడు నేడు స్కీం.. మనబడి – మన భవిష్యత్ పేరుతో కొనసాగుతుందన్నారు. సీబీఎస్‌ఈ కోర్సు పరీక్ష టఫ్‌గా ఉంటుందని.. వాళ్లకు సరైన ప్రిపరేషన్‌ కూడా పరీక్షలకు వెళ్లారని, అందుకే నెగటివ్ ఫలితాలు వస్తున్నాయన్నారు. విద్యావ్యవస్థలో సంస్కరణలు అవసరమని, వాటిని అమలు చేయడం కోసం ఉపాధ్యాయ సంఘాలు, మేథావుల అభిప్రాయాలను తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో ఉన్న పరిశ్రమల విస్తరణ, కొత్త పెట్టుబడుల కోసం పారిశ్రామిక వేత్తలతో మాట్లాడుతున్నామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.