Minister Merugu Nagarjuna: బడుగు, బలహీన వర్గాల స్థితిగతులు పెంచేందుకు జగన్ ఎంతో కృషి చేస్తున్నారని మంత్రి మేరుగ నాగార్జున పేర్కొన్నారు. రాష్ట్రంలోనే పేదల విద్యార్థులు బాగుండాలనే ఉద్దేశంతో ఇంగ్లీష్ మీడియంలో తీసుకువచ్చారని.. చంద్రబాబు మనవడు ఇంగ్లీష్ మీడియంలో చదవచ్చు.. వాళ్ళ బంధువులు చదవచ్చు.. కానీ బడుగు వర్గాల పిల్లలు మాత్రం చదువుకోకూడదని న్యాయస్థానాలకు వెళ్ళాడని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. అనారోగ్య కారణాలతో ఎందరో బడుగులు మరణించారని.. దానిని చూసే వైయస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకువచ్చారన్నారు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేయించుకునే మొత్తాన్ని రూ.25 లక్షలకు జగన్ పెంచారని తెలిపారు. పార్టీలతో సంబంధం లేకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలను ఇస్తున్నారని వెల్లడించారు.
Read Also: Deputy CM Peedika Rajanna Dora: అన్ని వర్గాల అవసరాలను తీర్చే పాలనను జగన్ ఇస్తున్నారు..
పేదల కోసం జగన్ ఎన్నో పథకాలను అమలు చేస్తుంటే… టీడీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారని మంత్రి అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు రాజకీయాల్లో కూడా బడుగులకు ఎంతో ప్రాధాన్యమిచ్చారని ఈ సందర్భంగా చెప్పారు. చంద్రబాబు హయాంలో దళితులపై దాడులు.. అఘాయిత్యాలు… అమానుషాలు జరిగాయన్నారు. అప్పట్లో భయంతో బతికేవారని మంత్రి చెప్పుకొచ్చారు. బీసీలు జడ్జిలుగా పనికిరాని చంద్రబాబు అన్నారని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబుకు వయసై పోయింది.. ఆయన మానసిక స్థితి కూడా బాగాలేదన్నారు. లోకేష్ పాదయాత్ర చేసి రెడ్ బుక్ చూపిస్తున్నాడన్న మంత్రి.. లోకేష్ పాదయాత్ర ప్రారంభించగానే కుటుంబ సభ్యులలో ఒకరు మరణించారని విమర్శించారు. అవినీతిలో చంద్రబాబు జైలుకెళితే… లోకేష్ ఎక్కడికో పారిపోయారన్నారు. చంద్రబాబు అరెస్ట్ వల్ల చనిపోయారని కొందరికి భువనేశ్వరి చెక్కులు ఇచ్చింది.. బెయిల్ వస్తే అన్నీ ఆపేసిందన్నారు. క్రైస్తవ మిషన్లకు చెందిన ఆస్తులను చంద్రబాబు అనుచరులు కాజేశారని ఆయన ఆరోపించారు. సంక్షేమ పథకాలపై చంద్రబాబుతో చర్చకు సిద్ధంగా ఉన్నామని ఆయన సవాల్ విసిరారు. అన్ని తరాల భవిష్యత్తు కోసం జగన్ పనిచేస్తున్నారని.. ఆయనను అందరూ ఆశీర్వదించాలని మంత్రి మేరుగ నాగార్జున స్పష్టం చేశారు.