Nara Lokesh: “2019లో ఈవీఎంలు గొప్పగా పని చేస్తే గెలిచి, ఓడిపోయినప్పుడు నిందిస్తారా?”

  • ప్రజలు జగన్ నుంచి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు డిమాండ్ చేస్తున్నారు
  • ఏళ్ల తరబడి ఏపీ ప్రజలు సమిష్టిగా నిర్మించిన వ్యవస్థలను విధ్వంసం చేశారు
  • జగన్ ట్వీట్ కి స్పందించిన లోకేష్
Nara Lokesh

Nara Lokesh

ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్ నుంచి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు డిమాండ్ చేస్తున్నారని విద్య, ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ అన్నారు. జగనుకు ప్రజాస్వామ్యం అంటే ఎలర్జీ అని ఆయన పేర్కొన్నారు. ప్రజా హక్కులను పరిరక్షించే సంస్థలు, వ్యవస్థలను క్రమపద్ధతిలో నాశనం చేశారని ఆరోపించారు. ఏళ్ల తరబడి ఏపీ ప్రజలు సమిష్టిగా నిర్మించిన వ్యవస్థలను విధ్వంసం చేశారన్నారు. 2019లో ఈవీఎంలు గొప్పగా పని చేస్తే గెలిచి, ఇప్పుడు ఓడిపోయినప్పుడు, ఈవీఎంలను నిందిస్తారా.? అని ప్రశ్నించారు. ప్రజల్ని వంచించిన తీరు గ్రహించి పూర్తిగా తిరస్కరించారని.. అంగీకరించలేకపోతున్నారా? అన్ని ప్రశ్నించారు. ఈవీఎంలపై మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మంత్రి నారా లోకేశ్ వివరణ ఇచ్చారు. ప్రజా ధనంతో కొనుగోలు చేసిన ఫర్నిచర్‌ను ఎప్పుడు తిరిగి ఇస్తున్నారు? అని అడిగారు. మరి పేదల కోసం ఉన్న రూ. 560 కోట్ల డబ్బును రుషికొండ ప్యాలెస్ కట్టుకోవడానికి ఎందుకు వెచ్చించారు? అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వీటన్నిటికీ సమాధానం కావాలంటూ.. మంత్రి లోకేశ్ ఎక్స్ వేదికగా స్పందించారు.

READ MORE: Car Crash : మద్యం మత్తులో ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న కార్మికుల పైకి దూసుకెళ్లిన కారు..

కాగా.. ఇటీవల మాజీ సీఎం జగన్ ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చెందిన ప్రజాస్వామ్య దేశాలు ఎన్నికల్లో ఈవీఎంలకు బదులుగా పేపర్ బ్యాలెట్లే వాడుతున్నారన్నారు. మన దేశంలోనూ అలాగే ఉపయోగించాలన్నారు. బ్యాలెట్ విధానంతో ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటే దిశగా మనం కూడా ముందుకు సాగాలన్నారు. తనకు న్యాయం జరగడమేకాదు.. జరిగినట్లు కనిపించాలని, ప్రజాస్వామ్యం మనగలగడం మాత్రమే కాదు.. మనగలుగుతుందని నిస్సందేహంగా చాటాలని జగన్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ ట్వీట్‌పై అధికార పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఈ ట్వీట్ పై స్పందించిన మంత్రి నారా లోకేష్ ఈ మేరకు సమాధానమిచ్చారు.