మునుగోడు రిటర్నింగ్ ఆఫీసర్ బదిలీ వ్యవహారంలో కేంద్ర ఎలక్షన్ కమిషన్ వ్యవహరించిన తీరు ఆక్షేపనీయని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిండెట్, మంత్రి కె. తారక రామారావు అన్నారు. తాజాగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ రాజ్యాంగ వ్యవస్థలను ఏ విధంగా దుర్వినియోగం చేస్తుందో తెలిపేందుకు ఇది ఒక మరో తార్కణమన్నారు. పార్టీలకు అతీతంగా ప్రజాస్వామ్యస్ఫూర్తికి అద్దం పట్టే విధంగా వ్యవహరించాల్సిన ఎలక్షన్ కమిషన్ పైన భారతీయ జనతా పార్టీ ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తుందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. 2011లోనే సస్పెండ్ చేసిన రోడ్రోలర్ గుర్తును తిరిగి పెట్టడం ప్రజాస్వామ్య స్ఫూర్తిని అపహాస్యం చేయడమేనని ఆయన మండిపడ్డారు. గతంలో తమ అభ్యర్ధన మేరకు రోడ్రోలర్ గుర్తును తొలగించి, మరోసారి తిరిగి ఈ ఎన్నికల్లో రోడ్డు రోలర్ ను తేవడం ఎన్నికల స్ఫూర్తికి విరుద్ధమని ఆయన విమర్శించారు.
తమ పార్టీ కారు గుర్తును పోలిన గుర్తులతో అయోమయానికి గురిచేసి దొడ్డిదారిన ఓట్లు పొందే కుటిల ప్రయత్నాన్ని బీజేపీ చేస్తుందని, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలన్న రాజ్యంగ స్ఫూర్తికి ఇది విఘాతం కలిగిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. భారతీయ జనతా పార్టీ రాజ్యాంగబద్ధ సంస్థలను తన స్వప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయడాన్ని ప్రజలు గమనించాలన్నారు మంత్రి కేటీఆర్. బీజేపీ జాతీయ నాయకత్వంలో కేంద్ర ఎన్నికల కమిషన్ పనిచేస్తోందని, మునుగోడులో ఓటమి తప్పదు అనే బీజేపీ అడ్డదారులు తొక్కుతున్నదని ఆయన అన్నారు.