కృష్ణా జిల్లాలో సాగునీటి కాల్వలు డ్రెయిన్లు నిర్వహణకు 55 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు సిద్దం చేశామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మచిలీపట్నంలో 17 కోట్ల రూపాయలతో 63 పనులకు ప్రతిపాదనలు సిద్ధం కాగా.. వర్షాకాలం వచ్చినా సాగునీటి కాల్వల నిర్వహణ చేపట్టకపోవడంపై మంత్రి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అధికారులను సాగునీటి కాల్వల్లో నీటి నిల్వలు గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే, గ్రామాల్లో తాగునీటి వనరుల కల్పన కోసం డీపీఆర్ సిద్దం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వ్యవసాయ సీజన్ లో రైతులకు విత్తనాలు ఎరువులు కొరత లేకుండా ముందుగానే ఇండెంట్ పెట్టాలని మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశాలు జారీ చేశారు.
Read Also: Hyderabad: కూతురిపై లైంగిక దాడికి పాల్పడిన తండ్రి.. నిరాకరించడంతో దారుణ హత్య
అలాగే, బందరు పోర్టు పనులపై కూడా గనులు, భూగర్భవనరులు,ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆరా తీశారు. రూ. 5, 156 కోట్ల రూపాయలతో నాలుగు బెర్తులతో 13 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్గో సామర్థ్యంతో 2025కి మొదటి దశ పనులు చేపట్టేలా పనులు చేస్తున్నట్టు మంత్రికి అధికారులు తెలిపారు. బందరు కార్పొరేషన్ పరిధిలో తాగునీటి సరఫరా మెరుగు పరచటంపై దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమం జిల్లా కలెక్టర్ డీకే బాలాజీతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.