Harish Rao: ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ప్రతినిధుల సభలు జరగుతున్నాయి. సిద్దిపేటలో మంత్రి హరీష్రావు అధ్యక్షతన బీఆర్ఎస్ ప్రతినిధుల సభ జరిగింది. ఈ సభలో ఆయన ప్రసంగించారు. గులాబీ నీడ కింద చల్లగా ఉన్నామంటే దానికి కారణం కేసీఆర్ అని నేతలకు మంత్రి సూచించారు. రైతు నాగలితో ఆకు పచ్చ చరిత్రను కేసీఆర్ రాశారన్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన వ్యక్తి కేసీఆర్ అని.. హిస్టరీలు క్రియేట్ చేయడం కేసీఆర్కి కొత్తేమి కాదన్నారు. తెలంగాణ కోసం డిప్యూటీ స్పీకర్ పదవి, కేంద్ర మంత్రి, ఎంపీ పదవులను త్యాగం చేయడం కేసీఆర్ హిస్టరీ అంటూ మంత్రి హరీష్ చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేయడం మరో చరిత్ర కాబోతోందన్నారు. ఆనాడు తిండి కోసం తిప్పలు పడ్డామని.. కానీ ఈనాడు దేశానికే ధాన్యం పెట్టే స్థాయికి ఎదిగామన్నారు. తెలంగాణలో ప్రతి ఇంట్లో కేసీఆర్ ఉన్నాడని మంత్రి హరీష్ తెలిపారు.
ఢిల్లీలో ఉన్న బీజేపీ వాళ్ళు మన పథకాలు కాపీ కొడుతున్నారని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. నితిన్ గడ్కరీ కాళేశ్వరం అద్భుతం అన్నారని ఈ సందర్భంగా చెప్పారు. ప్రధానమంత్రి స్వయంగా పార్లమెంట్లో స్వయంగా చెప్పారని.. ఎప్పుడు వచ్చినా కేసీఆర్ ప్రాజెక్టుల గురించి అడుగుతారని.. గల్లీల్లో మాత్రం ప్రధాని మనపై విమర్శలు చేస్తారన్నారు. ఆయన తప్పుల్ని ప్రశ్నించినందుకే కేసీఆర్ చెడ్డోళ్లు అయిపోయారన్నారని ప్రధానిని ఉద్దేశించి పేర్కొన్నారు. అడిగితే సీబీఐ, ఈడీ, ఐటీ రైడ్స్ చేసి బెదిరిస్తారని విమర్శించారు. కేసీఆర్ వీటికి భయపడడని మంత్రి చెప్పారు.
Read Also: Opposition unity: ప్రధాని పదవి ఖాళీ లేదు.. మమత- నితీష్ భేటీపై బీజేపీ ఎద్దేవా
నిజాన్ని మనం ప్రచారంలో పెట్టాలని నేతలకు మంత్రి సూచించారు. వచ్చే రెండు నెలల్లో సిద్దిపేటకి రైలు వస్తుందని చెప్పారు. ప్రధాని మన్ కీ బాత్లో తియ్య తియ్యని మాటలు చెబుతారని.. కానీ మన్ కీ బాత్ కాదు.. కిసాన్ కీ బాత్ వినాలన్నారు. అదానీ, అంబానీల ఆస్తులు పెంచడమే బీజేపీ పని అని మంత్రి విమర్శలు గుప్పించారు. తెలంగాణకు సమాధులు తవ్వేటోడు, కూలగొట్టెటోడు కాదు.. బలమైన పునాదులు కావాలన్నారు. సిద్దిపేట ప్రజలకు చివరి శ్వాస వరకు సేవ చేస్తానని మంత్రి పేర్కొన్నారు. వడగళ్ల వానతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామని.. రైతులు అధైర్య పడవద్దు అంటూ మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చారు.