Harish Rao: గులాబీ పార్టీ ప్రజలకు గులాంగిరి చేస్తుంది.. ఢిల్లీ పెద్దలకు కాదు..

Harish Rao

Harish Rao

Harish Rao: సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లోని బీఆర్‌ఎస్‌ సమ్మేళనంలో మంత్రి హరీష్‌ రావు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై మండిపడ్డారు. కాంగ్రెస్ వాళ్లు ఢిల్లీలో ఉన్నోళ్లకు గులాంగిరి చేస్తారని, బీజేపీ వాళ్లు గుజరాత్ పెద్దలకు గులాంగిరి చేస్తారని.. కానీ బీఆర్‌ఎస్ వాళ్లు తెలంగాణ ప్రజలకు గులాం గిరి చేస్తారని మంత్రి అన్నారు. కాంగ్రెస్, బీజేపీ సోషల్ మీడియాలో అబద్ధాలను ప్రచారం చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ సోషల్ మీడియా సొంటకాయల మోతలను తిప్పి కొట్టాలని బీఆర్‌ఎస్ నేతలకు సూచించారు. మనం చేసిన అభివృద్ధి గురించి ప్రచారం చేయాలన్నారు.

రాష్టంలో పార్టీలను రెండు పర్యాయాలు నిలబెట్టిన వారు ఒకరు ఎన్టీఆర్‌ అయితే, మరొకరు కేసీఆర్ అంటూ మంత్రి హరీష్ రావు కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలను కేంద్ర ప్రభుత్వం కాపీ కొడుతుందని ఆయన ఆరోపించారు. దేశంలో మార్పు కోసం కేసీఆర్ బయలుదేరారని మంత్రి చెప్పారు. మన నినాదం ఒక్కటే రైతు నినాదమంటూ బీఆర్‌ఎస్‌ నేతలను ఉద్దేశించి వెల్లడించారు. గులాబీ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గులాం గిరి చేస్తుంది తప్ప ఢిల్లీ పెద్దలకు కాదన్నారు. 60 సంవత్సరాల అభివృద్ధిని 6 సంవత్సరాలలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేశారని పేర్కొన్నారు. అభివృద్ధిలో 60 ఏళ్ల వెనుక ఉన్న గజ్వేల్‌ను 60 ఏళ్ళు ముందుకు కేసీఆర్ తీసుకెళ్లారన్నారు.

Read Also: DSC notification: గుడ్‌న్యూస్‌.. త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్..!

సీఎం కేసీఆర్‌ను వేరే జిల్లాల్లో పోటీ చేయాలని నాయకులు అడుగుతున్నారని.. మీరు కేసీఆర్‌ను వేరే దగ్గరకు పంపించడానికి సిద్ధంగా ఉన్నారా అంటూ మంత్రి హరీష్‌ రావు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో మేము వెళ్లనివ్వమంటూ.. గజ్వేల్‌ నుంచి కేసీఆర్ పోటీ చేయాలని కార్యకర్తలు, ప్రజలు తెలిపారు.