Bala Veeranjaneya Swamy: ఒంగోలు కలెక్టరేట్ లో జిల్లాలో నెలకొన్న సమస్యలపై మంత్రి బాల వీరాంజనేయ స్వామి సమీక్ష నిర్వహించారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయకుండానే జగన్ ప్రారంభించారని.. పనులు పూర్తిగా కాకుండా ప్రాజెక్టు ప్రారంభించి ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇచ్చారన్నారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంపై త్వరలోనే సీఎం చంద్రబాబు సమీక్ష ఉంటుందన్నారు. వెలిగొండ ప్రాజెక్టుని త్వరితగతిన పూర్తి చేస్తామని, జిల్లాలో తాగునీటి సమస్య లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి బాల వీరాంజనేయ స్వామి ఆదేశించారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయినా పట్టించుకోలేదన్నారు. గత ప్రభుత్వంలో రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని విమర్శించారు.
ఎస్సీ విద్యార్థులకు చదువులకు దూరం చేసి డేటా కూడా మాయం చేసారు. గత ప్రభుత్వ ఇరిగేషన్ మంత్రికి పోలవరం ప్రాజెక్టు గురించి అర్ధకాలేదట.. డ్యాన్సులు వేసుకుంటూ కూర్చుంటే ఎలా అర్థం అవుతుందని ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు పోలవరంపై యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేసారు.. ప్రాజెక్టు త్వరలో పూర్తవుతుందన్నారు. అన్నా క్యాంటీన్లు కూడా త్వరలో పునః ప్రారంభిస్తామన్నారు. పెరిగిన పెన్షన్లు ఒకటవ తేదీ నుంచే ఇస్తామన్నారు. జిల్లా సమస్యలపై చర్చించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులను అష్ట కష్టాలు పెట్టిన పథకాల స్థానంలో ఇబ్బందులు లేని పథకాలు తీసుకొస్తామన్నారు. పనిచేసేవాళ్ళకే ప్రజలు పట్టం కడతారు.. మీరు చేయలేదు కాబట్టే మీకు అవకాశం ఇవ్వలేదని మంత్రి వ్యాఖ్యానించారు.