Minister Anam Ramanarayana Reddy: శాసనసభ అంటే వారికి గౌరవం లేదు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నాం..

  • వైసీపీ అధినేత వైఎస్‌ జగన్ కు ప్రతిపక్ష హోదా రాదని స్పష్టం చేసిన మంత్రి ఆనం..
  • శాసనసభ అంటే ఆయనకు గౌరవం లేదని వ్యాఖ్య..
  • వాలంటీర్ల వ్యవస్థ పై రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటుందని వెల్లడి..
Anam

Anam

Minister Anam Ramanarayana Reddy: వైసీపీ అధినేత వైఎస్‌ జగన్ కు ప్రతిపక్ష హోదా రాదని స్పష్టం చేశారు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ.. నెల్లూరులో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. శాసనసభ అంటే ఆయనకు గౌరవం లేదని.. సభ నియమాలను కూడా ఆయన ఎప్పుడూ పాటించలేదన్నారు.. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు స్పీకర్ ను బెదిరించి పాలన చేశారని విమర్శించారు. శాసనసభ నిబంధనలు కూడా వైఎస్‌ జగన్‌కు తెలియవని.. జగన్ సలహాదారులు కూడా అలానే ఉన్నారని ఎద్దేవా చేశారు. చట్టాలు. రాజ్యాంగం.. నిబంధనలు తెలియని 79 మందిని సలహాదారులుగా జగన్ పెట్టుకున్నారని సెటైర్లు వేశారు. ఈ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి 11 స్థానాలు మాత్రమే వచ్చాయని.. దీంతో ఆయన ఫ్లోర్ లీడర్ గా మాత్రమే ఉండవచ్చన్నారు.

Read Also: CM Revanth: కేసీఆర్ పూర్తిగా చేతులెత్తేయడం వల్లే బీజేపీకి లాభం జరిగింది..

ఇక, వాలంటీర్ల వ్యవస్థ పై రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఒక నిర్ణయం తీసుకోనుందన్నారు మంత్రి ఆనం.. కనీసం, ఒక గంట సేపు జగన్.. ఎక్కడైనా వుండాలనుకున్నా.. ఆయన ప్యాలస్ నే కోరుకుంటారన్నారు. అందువల్లే ఎలాంటి అనుమతులు లేకుండా 28 చోట్ల పార్టీ కార్యాలయాల పేరుతో పెద్ద ప్యాలస్ లను కడుతున్నారన్నారు. భవిష్యత్తులో ఈ కార్యాలయాలను ఆస్తులుగా ఆయన మార్చుకుంటారని ఆనం విమర్శించారు. మరోవైపు.. తిరుమల పవిత్రతను దెబ్బతీశారని.. అందుకే టీటీడీని ప్రక్షాళన చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారన్నారు. ఎన్నికల్లో సవాళ్లు విసిరి.. ఓడిపోయిన నాయకులకు పిచ్చి పట్టిందని.. నెల్లూరులో అనిల్ కుమార్ యాదవ్.. తిరుపతి జిల్లాలో మరో వ్యక్తి ఉన్నారన్నారని సెటైర్లు వేశారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబు అమలు చేస్తున్నారని వెల్లడించారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి.