Nimmala Rama Naidu: మహానాడు పనుల్లో బిజీగా మంత్రి నిమ్మల.. పార చేతపట్టి మరీ..!

  • మహానాడు పనుల్లో బిజీగా మంత్రి నిమ్మల
  • పార చేతపట్టి సభా ప్రాంగణాన్ని చదును చేసిన నిమ్మల
  • ఈరోజు సాయంత్రం కడపకు సీఎం చంద్రబాబు
Nimmala Mahanadu

Nimmala Mahanadu

కడపలో టీడీపీ ‘మహానాడు’ సంబరం మంగళవారం ప్రారంభమవుతోంది. టీడీపీ చరిత్రలో తొలిసారిగా వైఎస్సార్‌ కడప జిల్లాలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు దాదాపు పూర్తి కావొచ్చాయి. రేపటి నుండి మూడు రోజుల పాటు మహానాడు నిర్వహించనున్నారు. మహానాడు పనుల్లో నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు బిజీగా ఉన్నారు. మహానాడు సభా ప్రాంగణ కమిటీ కన్వీనర్‌గా ఉన్న నిమ్మల.. వర్షం కారణంగా సభా ప్రాంగణంలోకి నీళ్లు రావడంతో స్వయంగా ఆయనే రంగంలోకి దిగారు. పార చేతపట్టి మట్టి తొవ్వుతూ.. సభా ప్రాంగణాన్ని చదును చేశారు.

వర్షం వచ్చినా మహానాడు నిర్వహణకు ఎటువంటి ఆటంకం లేకుండా అన్ని చర్యలు చేపట్టామని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. నిన్న కురిసిన వర్షానికి కాస్తంత ఆటంకం కలిగినా.. రాబోవు మూడు రోజుల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ట్రెంసింగ్ పనులు చేపట్టినట్లు వివరించారు. వచ్చే 4-5 రోజుల పాటు వర్షాలు ఉన్నాయన్న ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో మహానాడు ప్రాంగణంలో మంత్రి నిమ్మల ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు.

Also Read: Road Accident: తూర్పు గోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి!

కడపలోని కమలాపురం నియోజకవర్గం పబ్బాపురం సమీపంలోని 150 ఎకరాల విస్తీర్ణంలో మహానాడు నిర్వహించనున్నారు. పార్టీ తోరణాలు, కటౌట్లు, ఫ్లెక్సీలతో మహానాడు ప్రాంగణం సహా కడప, కమలాపురం మొత్తం పసుపుమయమయ్యాయి. సీఎం చంద్రబాబు ఈరోజు సాయంత్రం కడపకు రానున్నారు. నాలుగు రోజుల పాటు ముఖ్యమంత్రి మహానాడు ప్రాంగణంలోనే బస చేనున్నారు. అందుకు తగిన ఏర్పాట్లను మంత్రి నిమ్మల ఇప్పటికే సిద్ధం చేశారు. ఈ రోజు మంత్రి నారా లోకేశ్‌ కుప్పం నుంచి కడపకు చేరుకోనున్నారు. ఇప్పటికే టీడీపీ మంత్రులంతా కడపకు తరలివచ్చారు.