Milind Deora: కాంగ్రెస్‌కు మిలింద్‌ దేవరా రాజీనామా.. నేడు శివసేనలో చేరిక!

Milind Deora Resigned

Milind Deora Resigned

Milind Deora Quits Congress and join Shiv Sena Today: మహారాష్ట్రలో కాంగ్రెస్‌ పార్టీకి భారీ షాక్‌ తగిలింది. ఆదివారం ఉదయం సీనియర్‌ నేత, మాజీ కేంద్ర మంత్రి మిలింద్‌ దేవరా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయన తన ఎక్స్‌లో పేర్కొన్నారు. ఇండియా కూటమి సీట్ల పంపకాల్లో అసంతృప్తికి గురైన మిలింద్‌.. ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన పార్టీలో నేడు మిలింద్‌ దేవరా చేరనున్నారని సమాచారం. కాంగ్రెస్‌ అగ్రనేత నేత రాహుల్‌ గాంధీ ‘భారత్‌ జోడో న్యాయ యాత్ర’ ప్రారంభ వేళ మిలింద్‌ పార్టీని వీడటం ఎదురుదెబ్బే అని చెప్పాలి.

‘ఈరోజుతో నా రాజకీయ ప్రయాణంలో ఓ ముఖ్యమైన అధ్యాయం ముగిసింది. కాంగ్రెస్‌ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశాను. పార్టీతో నా కుటుంబానికి ఉన్న 55 ఏళ్ల అనుబంధం ముగిసింది. ఇన్నేళ్లు నాకు అండగా నిలిచిన పార్టీ కార్యకర్తలు, నాయకులు, సహచరులకు ధన్యవాదాలు’ అని మిలింద్‌ దేవరా ట్వీట్ చేశారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మురళీ దేవరా కుమారుడే ఈ మిలింద్‌. కాంగ్రెస్ పార్టీలోని యువ నాయకుల్లో మిలింద్‌ ఒకరు. దక్షిణ ముంబై లోక్‌సభ స్థానం నుంచి 2004, 2009లో విజయం సాధించారు. 2012లో కేంద్ర మంత్రిగా పనిచేశారు. అయితే 2014, 2019లో శివసేన నేత అరవింద్‌ సావంత్‌ చేతిలో ఓటమి పాలయ్యారు.

Also Read: Aaron Finch: క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఆరోన్ ఫించ్.. జెర్సీ నెంబర్ 5కి రిటైర్మెంట్! ఇదే తొలిసారి

మిలింద్‌ దేవరా తన మద్దతుదారులు, కొంతమంది కార్పొరేటర్లతో కలిసి మహారాష్ట్ర ముఖ్యమంత్రి నివాసంలో ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరనున్నారని తెలుస్తోంది. ఇండియా కూటమి సీట్ల పంపకాల్లో భాగంగా దక్షిణ ముంబై లోక్‌సభ స్థానాన్ని శివసేనకి కేటాయించనున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్‌-శివసేన (ఉద్ధవ్‌ వర్గం) కూటమిలో భాగంగా చర్చలు జరుగుతున్నాయి. ఒకవేళ సీటు కేటాయిస్తే టికెట్‌ దక్కడం కష్టమనే భయాలు మిలింద్‌కు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన కాంగ్రెస్‌ను వీడి ఏక్‌నాథ్‌ షిండే వర్గంలో చేరి.. టికెట్‌ సాధిస్తారనే ప్రచారం జరుగుతోంది.