MLC Elections: మెదక్-కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఎన్నికల పోలింగ్ మరికొద్ది సేపట్లో ప్రారంభంకానుంది. ఈరోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఈ ఎన్నికల్లో మొత్తం 56 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన 11 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో 40 పోలింగ్ కేంద్రాల్లో 25,652 మంది గ్రాడ్యుయేట్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మెదక్ జిల్లాలో 22 పోలింగ్ కేంద్రాల్లో 12,472 మంది పట్టభద్రులు ఓటు వేయనున్నారు. అలాగే, సిద్ధిపేట జిల్లాలో 40 పోలింగ్ కేంద్రాల్లో 32,589 మంది గ్రాడ్యుయేట్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
Also Read: ENG vs AFG: ఉత్కంఠ పోరులో అఫ్ఘానిస్తాన్ విజయం..
మరోవైపు, మెదక్-కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ఎన్నికల్లో 15 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వారిలో ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ఐదుగురు అభ్యర్థులున్నారు. ఈ ఎన్నికల్లో సంగారెడ్డి జిల్లాలో 28 పోలింగ్ కేంద్రాల్లో 2,690 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మెదక్ జిల్లాలో 21 పోలింగ్ కేంద్రాల్లో 1,347 మంది టీచర్ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక సిద్ధిపేట జిల్లాలో 23 పోలింగ్ కేంద్రాల్లో 3,212 మంది టీచర్లు ఓటు వేయనున్నారు. ఈ ఎన్నికల కోసం ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని, స్వేచ్ఛగా ఓటేయాలని ఎన్నికల అధికారులు కోరారు.
గత 20 రోజులుగా వివిధ అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు ఎన్ని తాయిలాలు ప్రకటించినప్పటికీ, ప్రధాన ప్రతిపక్షమైన భారత రాష్ట్ర సమితి (BRS) ఈ ఎన్నికలకు దూరంగా ఉండటం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో ప్రధానంగా భారతీయ జనతా పార్టీ (BJP), కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య త్రిముఖ పోరు నెలకొంది. అన్ని ప్రధాన పార్టీలు తమ గెలుపు కోసం సమగ్ర వ్యూహాలు రచించాయి. ఈ ఎన్నికల కౌంటింగ్ మార్చి 3న జరుగుతుంది.