మంచు మోహన్బాబు కుటుంబసభ్యులపై కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయి. ఏపీలో సినిమా టిక్కెట్ ధరల అంశం, సన్నాఫ్ ఇండియా మూవీ అడ్వాన్స్ బుకింగ్స్, కలెక్షన్లు.. ఇలా ప్రతి అంశం సోషల్ మీడియాలో ట్రోలింగ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మంచు విష్ణుకు చెందిన నిర్మాణ సంస్థ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ తరఫున హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు శేషు కుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు.
మంచు ఫ్యామిలీపై వస్తున్న ట్రోల్స్ను తక్షణమే తొలగించకపోతే చర్యలు తీసుకుంటామని, రూ. 10 కోట్లు పరువు నష్టం దావా వేస్తామని శేషుకుమార్ వెల్లడించారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా వేదికల్లో మంచు ఫ్యామిలీ మీద చేసిన అనుచిత వ్యాఖ్యలను తొలగించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ట్రోలింగ్ చేసే వారిపై చర్యలు తీసుకోవడం ఆలస్యం అయితే.. మంచు ఫ్యామిలీ కుటుంబీకుల మీద పర్సనల్ ఎటాక్ చేసినందుకు క్రిమినల్ కేసులు పెట్టడంతో పాటు రూ. 10 కోట్ల పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు.