ఈ ఏడాది సంక్రాంతికి థియేటర్లలో సందడి చేసి, బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాసిన సినిమా “మన శంకర వరప్రసాద్ గారు”. మెగాస్టార్ చిరంజీవి తనదైన శైలిలో మాస్ అండ్ కామెడీ టైమింగ్తో చేసిన ఈ సినిమా ‘రీజనల్ ఇండస్ట్రీ హిట్’గా నిలిచింది. దర్శకుడు అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్ ఫ్యాన్స్కు ఫుల్ మీల్స్ పెట్టడంతో, ఈ సినిమా భారీ వసూళ్లను సాధించింది. థియేటర్లలో విజయవంతంగా రన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.
తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా డిజిటల్ హక్కులను దక్కించుకున్న జీ 5 (Zee5) సంస్థ, ఫిబ్రవరి 11 నుంచి స్ట్రీమింగ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. తెలుగుతో పాటు ఇతర పాన్ ఇండియా భాషల్లో కూడా ఈ సినిమా అందుబాటులోకి రానుంది. భీమ్స్ అందించిన సంగీతం, నయనతార నటన ఈ సినిమాకు ప్లస్ కాగా.. వెంకటేష్ ఇచ్చిన సాలిడ్ కామియో థియేటర్లలో విజిల్స్ వేయించింది. సుష్మిత కొణిదెల, సాహు గారపాటి నిర్మించిన ఈ చిత్రం ఓటీటీలో ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశం ఉంది.