Maldives Tourism Threat: కొత్తగా పెళ్లి చేసుకున్న చాలా మంది నూతన దంపతుల హనీమూన్ స్పాట్, డైవింగ్ ఔత్సాహికులకు ఒక ప్రధాన గమ్యస్థానం మాల్దీవులు. ఈ అందమైన ప్రాంతం త్వరలో మాయం కానున్నట్లు జోరుగా ప్రచారం సాగుతుంది. పెరుగుతున్న సముద్ర మట్టాలు ఈ హిందూ మహాసముద్ర ద్వీపసమూహం తీరాలను తాకుతున్నాయి. ముంచుకొస్తున్న ఈ సముద్ర మట్టాల కారణంగా ఈ 1,200 పగడపు దీవులు పూర్తిగా మునిగిపోయే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. మాల్దీవుల ఉనికి మాత్రమే కాకుండా తువాలు, కిరిబాటి, మార్షల్ దీవులు వంటి చిన్న ద్వీప దేశాల ఉనికి కూడా ముప్పులో ఉందని అంచనా వేస్తున్నారు. అసలు ఏం జరగబోతుంది..
READ ALSO: తక్కువ ఖర్చు.. ఎక్కువ లాభం! చిరు వ్యాపారుల కోసం కొత్త Tata Ace Gold Plus Mini Truck లాంచ్..
1 మీటర్ కంటే తక్కువ ఎత్తులో మాల్దీవులు..
సముద్ర మట్టానికి ఒక మీటర్ కంటే తక్కువ ఎత్తులో మాల్దీవుల 80 శాతం భూమి ఉంది. దీని కారణంగా మాల్దీవులు కోతకు గురికావడమే కాకుండా అంతరించిపోయే ప్రమాదం కూడా ఉందని వాతావరణ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. వాతావరణ మార్పులు వేగవంతంగా జరుగుతున్న కొద్దీ మాల్దీవులు, తువాలు, కిరిబాటి, మార్షల్ దీవులు వంటి చిన్న ద్వీప దేశాలు కనుమరుగు కావడానికి గురయ్యే ప్రమాదం పొంచి ఉందని చెబుతున్నారు.
సముద్ర మట్టాలు ఎంత పెరిగాయో తెలుసా..
నిజానికి మాల్దీవులు ఇప్పటికి ఇప్పుడు మునిగిపోవని అంటున్నారు. కానీ పెరుగుతున్న మహాసముద్రాల నీటి మట్టాల కారణంగా దానికి ముప్పు పెరుగుతోందని వాతావరణ శాఖ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 1900 నుంచి ప్రపంచ సముద్ర మట్టాలు దాదాపు 20 సెం.మీ. పెరిగాయి. మంచుకొండలు కరుగడం, వెచ్చని నీటి విస్తరణ కారణంగా ఇటీవల ఈ రేటు సంవత్సరానికి 4 మి.మీ. పెరిగింది. సముద్రానికి 2.4 మీటర్లు ఎత్తైన ప్రదేశంగా ఉన్న మాల్దీవులకు.. చిన్న శాతం నీటి పెరుగుదల కూడా విపత్తుకు దారితీస్తుంది. 2050 నాటికి 30-50 సెం.మీ. పెరుగుదల ఉంటుందని అంచనాలు వెలువడుతున్నాయి. 2100 నాటికి సముద్రం 77% భూమిని ముంచెత్తే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
ఫిజీలో భూమిని కొనుగోలు చేసిన కిరిబాటి..
ఈ సమస్య కేవలం మాల్దీవులకే పరిమితం కాలేదు. పసిఫిక్, హిందూ మహాసముద్రాల అంతటా ఉన్న చిన్న దీవులకు కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుందని అంటున్నారు. 11 వేల మంది నివసించే తువాలులోని తొమ్మిది దీవులు 2050 నాటికి నివాసయోగ్యంగా మారనున్నాయి. కిరిబాటి అధ్యక్షుడు ఇప్పటికే ఫిజీలో భూమిని కొనుగోలు చేసినట్లు సమాచారం. మార్షల్ దీవులు అమెరికా అణు పరీక్షల నుంచి రేడియోధార్మిక పతనంతో ఇబ్బంది పడుతున్నాయి. ఈ సమస్య సముద్ర మట్టాలు పెరగడం వల్ల మరింత తీవ్రమవుతుందని అంచనా.
వీళ్లకు భూమి లేకపోతే ఏం జరగబోతుంది..
పైన చెప్పుకున్న దేశాల భూమి అదృశ్యమైతే పరిణామాలు వినాశకరమైనవిగా మారుతాయి. మాల్దీవులలోని 540,000 మంది నివాసితులు భారతదేశం, శ్రీలంక లేదా ఆస్ట్రేలియాలోని ఎత్తైన ప్రాంతాలలో ఆశ్రయం కోరుతూ శరణార్థులుగా మారవచ్చు. పునరావాసం సమాజాలను విచ్ఛిన్నం చేస్తుంది. పర్యాటకం మాల్దీవులలో 60 శాతం మందికి ఉపాధి కల్పిస్తుంది. బీచ్లు లేకుండా, రిసార్ట్లు మూసివేయబడతాయి, దీంతో ఉద్యోగాలు పోతాయి. ఈ సమస్యను అధిగమించడానికి మాల్దీవులు విభిన్న ప్రయత్నాలను ముమ్మరం చేస్తుంది. దీవులను పైకి లేపడానికి ఇసుకను పంపింగ్ చేస్తోంది. సముద్ర గోడలను నిర్మిస్తోంది, అలాగే తేలియాడే నగరాలతో ప్రయోగాలు చేస్తోంది. మాలే సమీపంలోని మానవ నిర్మిత ద్వీపమైన హుల్హుమలే 100,000 మందికి నివాసంగా ఉంది. ఇది సముద్ర మట్టానికి 2 మీటర్ల ఎత్తులో ఉంది. అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజు సౌరశక్తితో పనిచేసే రిసార్ట్లు వంటి “వాతావరణ అనుకూల” పర్యాటకాన్ని ప్రోత్సహిస్తున్నారు.