New Banking Rules: అలర్ట్.. ఏప్రిల్ 1 నుండి మారనున్న బ్యాంకింగ్ నిబంధనలు! ముఖ్యమైన మార్పులు ఏంటంటే?

  • ఏప్రిల్ 1 నుండి మారనున్న బ్యాంకింగ్ నిబంధనలు
  • కొత్త ఆర్థిక ఏడాది మొదలు నేపథ్యంలో పలు మార్పులు.
  • ఏటీఎం విత్‌డ్రాయల్ ఛార్జీలు, పరిమితులు.. మినిమమ్ బ్యాలెన్స్ లలో మార్పులు.
Bank

Bank

New Banking Rules: ప్రతి ఆర్థిక సంవత్సరం మొదలయ్యే ముందు చాలా బ్యాంకులు కొన్ని కొత్త రూల్స్ ను తీసుకొస్తుంటాయి. ప్రతి కొత్త ఆర్థిక ఏడాది లాగే ఈ ఏడాది కూడా కొన్ని రూల్స్ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే దేశంలోని ప్రముఖ బ్యాంకులు తమ నిబంధనల్లో మార్పులను ప్రకటించాయి. ఈ మార్పులు ప్రధానంగా సేవింగ్స్ అకౌంట్లు, ఏటీఎం లావాదేవీలు, క్రెడిట్ కార్డులు, ఇతర బ్యాంకింగ్ సర్వీసులకు సంబంధించినవిగా ఉన్నాయి. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, పీఎన్‌బీ, కానరా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ వంటి ప్రముఖ బ్యాంకులు తమ బ్యాంకింగ్ విధానాలను మరింత పారదర్శకంగా మార్చడం, కస్టమర్లకు మరింత మెరుగైన సేవలను అందించడమే లక్ష్యంగా ఈ మార్పులకు శ్రీకారం చుట్టారు.

Read Also: 5G Smartphones: కేవలం పదివేలలో బెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్స్..

ఏటీఎం విత్‌డ్రాయల్ ఛార్జీలు, పరిమితులు:
ఏటీఎం విత్‌డ్రాయల్ ఛార్జీలను కొన్ని బ్యాంకులు మార్చినట్లు ప్రకటించాయి. ఏప్రిల్ 1 నుండి ఇతర బ్యాంకుల ఏటీఎంల వద్ద ఉచిత లావాదేవీల సంఖ్య తగ్గించబడింది. కస్టమర్లు ప్రత్యేకంగా ఇతర బ్యాంకుల ఏటీఎంలను ఉపయోగించినప్పుడు మూడు ఉచిత లావాదేవీలు మాత్రమే చేయగలరు. ఆ తర్వాత ప్రతి అదనపు విత్‌డ్రాయల్‌కు రూ. 17లు ఛార్జీ విధించనున్నారు.

మినిమమ్ బ్యాలెన్స్:
ఎస్‌బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB), కానరా బ్యాంక్ వంటి ప్రముఖ బ్యాంకులు మినిమమ్ బ్యాలెన్స్ నిబంధనలను మార్చనున్నట్లు ప్రకటించాయి. ఏప్రిల్ 1 నుండి గ్రామీణ, పట్టణ, నగరాల కోసం ప్రత్యేకమైన మినిమమ్ బ్యాలెన్స్ నియమాలను అమలు చేయనున్నారు. ఖాతాదారులు ఈ బ్యాలెన్స్‌ను నిలుపుకోలేకపోతే జరిమానాకు గురవుతారు. అంతేకాదు, సేవింగ్స్ అకౌంట్లపై వడ్డీ రేట్లను కూడా బ్యాలెన్స్ ఆధారంగా నిర్ణయించనున్నట్లు సమాచారం.

క్రెడిట్ కార్డ్ నిబంధనల్లో మార్పులు:
ఎస్‌బీఐ, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ తమ కో-బ్రాండెడ్ విస్తారా క్రెడిట్ కార్డులకు సంబంధించిన కొన్ని నిబంధనలను మార్పులను చేసాయి. క్లబ్ విస్తారా ఎస్‌బీఐ ప్రైమ్ క్రెడిట్ కార్డ్, క్లబ్ విస్తారా ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ కోసం ఇప్పటివరకు అందిస్తున్న టికెట్ వౌచర్ సౌకర్యాన్ని ఇకపై రద్దు చేయనున్నారు.

Read Also: Health Tips: ఉక్కు లాంటి కండరాల కోసం ఈ కూరగాయలు బెస్ట్.. గుడ్లలో కంటే ఎక్కువ ప్రోటీన్!

డిజిటల్ బ్యాంకింగ్ పై దృష్టి:
బ్యాంకులు తమ మొబైల్ బ్యాంకింగ్ సేవలను మెరుగుపరచడం, AI చాట్‌బాక్స్‌లు ప్రవేశపెట్టడం, డిజిటల్ లావాదేవీల భద్రతను పెంచడం వంటి చర్యలను చేపట్టాయి. ఇందులో ముఖ్యంగా టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ (Two-Factor Authentication) ను మరింత పటిష్టంగా చేస్తూ వినియోగదారుల లావాదేవీల భద్రతను పెంచనున్నారు.

పాజిటివ్ పే సిస్టమ్:
వ్యాపార లావాదేవీలు మరింత సురక్షితంగా, పారదర్శకంగా ఉండేందుకు కొన్ని బ్యాంకులు పాజిటివ్ పే సిస్టమ్ (Positive Pay System) ను ప్రవేశపెట్టాయి. ఈ కొత్త విధానం ప్రకారం రూ. 5000 పైగా చెల్లింపుల కోసం చెక్ ఇచ్చే కస్టమర్లు ముందుగా తమ చెక్ వివరాలను ధృవీకరించాల్సి ఉంటుంది. ఈ విధానం మోసాలను నివారించడానికి ఉపయోగపడుతుంది.