ప్రస్తుతం మన దేశంలోని పలు నగరాల్లో వంటగ్యాస్ (LPG) సరఫరాపై ఒత్తిడి పెరుగుతోంది. గ్యాస్ సిలిండర్ల డిమాండ్ పెరగడం, రవాణాలో కొన్ని అడ్డంకులు ఎదురవ్వడంతో డెలివరీలో జాప్యం జరుగుతోంది. ఇదే సమయంలో ప్రభుత్వం గృహ అవసరాలకు వాడే సిలిండర్లు, వ్యాపార అవసరాలకు వాడే సిలిండర్ల ధరలను కూడా పెంచింది. ఈ నేపథ్యంలో ఒక కుటుంబం ఏడాదికి ఎన్ని సిలిండర్లు బుక్ చేసుకోవచ్చు, ఇంట్లో ఎన్ని ఉంచుకోవచ్చు అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం.. ఒక కుటుంబం ఏడాదికి (ఆర్థిక సంవత్సరం) 12 సబ్సిడీ సిలిండర్లను పొందే హక్కు ఉంటుంది. ఒకవేళ అంతకంటే ఎక్కువ అవసరమైతే, మరో మూడు సిలిండర్లను మార్కెట్ ధర చెల్లించి తీసుకోవచ్చు. అంటే మొత్తం మీద ఏడాదికి 15 సిలిండర్ల వరకు బుక్ చేసుకునే అవకాశం ఉంది. అయితే.. గ్యాస్ సిలిండర్ల అక్రమ నిల్వలను అరికట్టడానికి ప్రభుత్వం ఒక బుకింగ్కు, మరో బుకింగ్కు మధ్య కనీసం 25 రోజుల గ్యాప్ ఉండాలని నిబంధన పెట్టింది. సాధారణంగా ఇంట్లో భద్రతా కారణాల దృష్ట్యా కేవలం రెండు సిలిండర్లను (ఒకటి వాడుకలో, మరొకటి రిజర్వ్) మాత్రమే ఉంచుకోవాలి. వ్యాపారాల కోసం అయితే 100 కిలోల వరకు గ్యాస్ను అనుమతి లేకుండా నిల్వ చేసుకోవచ్చు.. అంతకు మించితే ప్రత్యేక అనుమతులు అవసరం. ఇంత కంటే ఎక్కువ నిల్వ ఉంచితే చట్ట ప్రకారం చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయి. జైలుకు వెళ్లే ప్రమాదం కూడా ఒక్కోసారి ఉంటుంది. అందుకు ఇంట్లో రెండు కంటే ఎక్కువ గ్యాస్ సిలిండర్లు ఉండటానికి వీలు లేదని నిబంధనలు తెలుపుతున్నాయి.
Also Read:Stock Market Rise: స్టాక్ మార్కెట్ ఈ రోజు సడన్గా పెరగడానికి కారణం ఏంటి..? ఏం జరిగిందంటే..
ఇక ధరల విషయానికి వస్తే.. దేశవ్యాప్తంగా డొమెస్టిక్ సిలిండర్ ధర 60 రూపాయలు, కమర్షియల్ సిలిండర్ ధర 144 రూపాయలు పెరిగింది. డొమెస్టిక సిలిండర్ ధర హైదరాబాద్లో రూ. 965.00 గా ఉంది. ఇతర నగరాల్లో చూస్తే ఢిల్లీలో రూ. 913, ముంబైలో రూ. 912.50, బెంగళూరులో రూ. 915.50, చెన్నైలో రూ. 928.50, కోల్కతాలో రూ. 939 , పాట్నాలో అత్యధికంగా రూ. 1,002.50 వద్ద ఉంది.
హోటళ్లు, రెస్టారెంట్లలో వాడే కమర్షియల్ గ్యాస్ ధర హైదరాబాద్లో రూ. 2,105.50 కు చేరింది. ఢిల్లీలో రూ. 1,884.50, ముంబైలో రూ. 1,836, కోల్కతాలో రూ. 1,988.50, చెన్నైలో రూ. 2,043.50 గా ఉంది. మధ్యప్రాచ్య దేశాల్లో యుద్ధ వాతావరణం, అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరగడమే ఈ సరఫరా ఇబ్బందులకు, ధరల పెంపునకు ప్రధాన కారణం. అక్రమ నిల్వలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.