తెలంగాణాలో మద్యం అమ్మకాలు మళ్లీ పెరిగాయ్. ప్రస్తుతం కోవిడ్ చాలా వరకు తగ్గుముఖం పట్టడంతో బార్లకు వెళ్లి మద్యం సేవించేవారి సంఖ్య గణనీయంగా పెరిగినట్లు ఎక్సైజ్ శాఖ చెబుతోంది. గత సంవత్సరంతో పోలిస్తే.. ప్రస్తుతం దాదాపుగా 29 శాతం వరకు మద్యం అమ్మకాలు పెరిగాయి. మద్యం తో సర్కార్ ఆదాయం కూడా అదేస్థాయిలో పెరిగింది. కరోనా టైంలో బీర్ల వినియోగం చాలా వరకు పడిపోయింది. అమ్మకాలు లేకపోవడంతో తయారీ సంస్థలు బీర్ల ఉత్పత్తిని తగ్గించాయి. కూల్ డ్రింక్స్, బీర్లు తాగడంతో కోవిడ్ సోకే అవకాశలు ఉన్నాయన్న వార్తలతో బీర్ బాటిల్స్ ని పక్కన పెట్టేశారు బీర్ ప్రియులు.
కరోన తరువాత చాలా మట్టుకు బీర్ల వినియోగం తక్కువగా ఉన్న కానీ సెప్టెంబర్ నుంచి బీర్ల అమ్మకాలు అనూహ్యంగా పెరిగాయి. ఈ ఒక్క నెలలోనే దాదాపు 25 శాతానికి పైగా బీర్స్ అమ్ముడయ్యాయి. ఇక బీర్ల అమ్మకాలను ప్రోత్సహించేందుకు ఒక్కో బాటిల్ పైన10 రూపాయల వరకు తగ్గించారు. ధరల తగ్గింపు కంటే కోవిడ్ భయం తొలగిపోవడం వల్లనే వినియోగం పెరిగిందని, దసరా కూడా వస్తుండటంతో బీర్స్ అమ్మకాలు పెరుగుతాయని అంటున్నారు.
ఇక ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు తెలంగాణాలో 14వేల 320 కోట్ల అమ్మం అమ్మకాలు జరిగాయి. రంగారెడ్డి జిల్లా నుంచే 3వేల247 కోట్ల ఆదాయం వచ్చింది.. ఇక రెండో స్థానంలో ఉన్న నల్గొండ జిల్లాలో మద్యం అమ్మకాలపైన 1,599 కోట్ల ఆదాయం, తరువాత మూడో స్థానంలో ఉన్న హైదరాబాద్ నుంచి 1510 కోట్ల ఆదాయం వచ్చింది. మొత్తంమీద కరోన కారణంగా చతికిల పడిన వ్యాపారాలన్నీ, కోవిడ్ తీవ్రత తగ్గడంతో గాడిన పడుతున్నాయి. సరిగ్గా పండగల సమయానికి కోవిడ్ తగ్గడం కూడా వ్యాపారులకు కలిసి వచ్చింది.