NTV Telugu Site icon

Lanka Dinakar: 2047 స్వర్ణాంధ్ర సాధన చంద్రబాబు లక్ష్యం

Lanka Dinakar

Lanka Dinakar

Lanka Dinakar: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వికసిత్ భారత్ 2047 అమల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ది పర్చాలనే లక్ష్యంతో రూపొందిస్తున్న స్వర్ణాంధ్ర @2047 విజన్ డాక్యుమెంట్ లక్ష్యాల సాధన దిశగా 20 సూత్రాల కార్యక్రమం అమలు చేయడం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ 20 సూత్రాల కార్యక్రమం అమలు ఛైర్మన్ లంకా దినకర్ తెలిపారు. శనివారం రాష్ట్ర సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ 20 సూత్రాల కార్యక్రమం అమలు ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం పాత్రికేయులతో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర బీజేపీ పెద్ద సహకారంతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశీస్సులతో ఈ బాధ్యతలను చేపట్టడం జరిగిందంటూ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ 2047 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ దేశంగా భారత దేశాన్ని అభివృద్ది పర్చాలనే లక్ష్యంతో వికసిత్ భారత్ 2047 కార్యక్రమాన్ని చేపడితే, 2.40 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దే లక్ష్యంతో స్వర్ణాంధ్ర @2047 విజన్ డాక్యుమెంట్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అమలు చేయాలనే లక్ష్యంతో ఉన్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల డబుల్ ఇంజన్ సర్కార్ కృషితో ఈ లక్ష్య సాధనను ఎంతో సునాయాసంగా సీఎం చంద్రబాబు సాధిస్తారు అనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇందుకై కేంద్ర ప్రాయోజిక పథకాలను పూర్తి స్థాయిలో వినియోగించుకొనేందుకు సీఎం ప్రత్యేక శ్రద్ద చూపుతున్నారన్నారు. ఈ లక్ష్య సాధనకు అనుగుణంగా రాష్ట్రంలో 20 సూత్రాల కార్యక్రమాన్ని అందరి సహకారంతో అమలు చేసే దిశగా తాను ముందుకు అడుగులు వేస్తున్నట్లు ఆయన తెలిపారు.

దేశంలో ఆర్థిక, రాజకీయ, సామాజిక మహిళా సాధికారత లక్ష్యంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ పనిచేస్తున్నారని, ఇదే అంశం తమ ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ముందుకు వెళుతున్నారన్నారు. దేశంలోని నిరుపేద మహిళలు అందరినీ లక్షాధికారులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో “లాక్ పతీ దీదీ” పథకాన్ని అమలు చేయడంతో పాటు చట్టసభలో మహిళా ప్రాతినిధ్యం పెంచాలనే లక్ష్యంతో మహిళలకు 1/3 వ వంతు రిజర్వేషన్‌ను వచ్చే ఎన్నికల నుంచి అమలు చేసేందుకు కూడా నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. అదే విధంగా రాష్ట్రంలో మహిళా సాధికారత సాధనకు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా పలు పథకాలను అమలు చేస్తున్నారన్నారు.

Read Also: AP Crime: ఇన్‌స్టాలో పరిచయం అయ్యాడు.. ఇల్లాలి ప్రాణం తీశాడు..!

అయితే గత ప్రభుత్వం ఐదేళ్లలో కేంద్ర నిధులను దారి మళ్లించి తమ ఇష్టాను సారం వినియోగించుకోవడం వల్ల కేంద్ర ప్రాయోజిత పథకాలు రాష్ట్రంలో సక్రమంగా అమలు కాలేదన్నారు. 2019 ఆగష్టు మాసంలో కేంద్రం జల్‌జీవన్ మిషన్‌ను ప్రారంభించే సమయంలో దేశవ్యాప్తంగా 16.75 శాతం గ్రామీణ గృహాలకు ట్యాప్ కనెక్షన్ ఉంటే అప్పటికే రాష్ట్రంలో 32 శాతం గ్రామీణ గృహాలకు ట్యాప్ కనెక్షన్లు ఉన్నాయన్నారు. 2022 డిశంబరు నాటికి దేశ వ్యాప్తంగా 70 శాతం గృహాలకు ట్యాప్ కనెక్షన్లు పెరగ్గా, రాష్ట్రంలో గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కేవలం 35 శాతం గృహాలకే ట్యాప్ కనెక్షన్లు పరిమితం అయ్యాయన్నారు. ఫలితంగా ప్రస్తుత రేట్ల ప్రకారం వ్యయం అధికంగా పెరిగిపోవడం వల్ల గతంలో కేవలం రూ.26 వేల కోట్లతో పూర్తి కావాల్సి పనులు నేడు రూ.54 వేల కోట్లకు పెరిగిపోయాయన్నారు. అయినప్పటికీ ఈ విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఎంతో శ్రద్ద చూపుతూ అందుకు తగ్గట్టుగా మ్యాచింగ్ నిధులను మంజూరు చేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుచున్నదన్నారు.

ప్రస్తుత ముఖ్యమంత్రి కేంద్ర ప్రాయోజిక పథకాలను పెద్ద ఎత్తున రాష్ట్రంలో వినియోగించుకునేందుకు ప్రత్యేక శ్రద్ద చూపుతున్నారని, అందుకు అనుగుణంగా నీతి ఆయోగ్ స్థిరమైన అభివృద్ది సూచికలకు అనుగుణంగా రాష్ట్రంలో 20 సూత్రాల కార్యక్రమాన్ని అమలు పర్చేందుకు శక్తి వంచన లేకుండా తాను కృషి చేస్తానని ఆయన తెలిపారు. కేంద్ర ప్రాయోజిత పథకమైన నేషనల్ గోకుల్ మిషన్ పథకం క్రింద రాష్ట్రంలో ఆవు నేయి ఉత్పత్తిని పెద్ద ఎత్తున పెంచాలనే లక్ష్యంతో ఈ మిషన్ అమలుకు, జల్ జీవన్ మిషన్ అమలుకు తాము అత్యంత ప్రాధాన్యత నిస్తూ తొలి కార్యక్రమాలను చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. కేంద్ర ప్రాయోజిత పథకమైన జల్ జీవన్ మిషన్ ద్వారా రాష్ట్రంలో ప్రతి గ్రామంలోని ప్రతి గృహానికి సురక్షితమైన మంచి నీటిని అందించాలనే లక్ష్యంతోనూ, కేంద్రం నుంచి గ్రామ పంచాయితీలకు వచ్చే నిధులను సకాలంలో అందజేసి గ్రామ పంచాయతీల స్వావలంబనకై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కృషి చేస్తున్నారన్నారు. యువతలో వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెద్ద ఎత్తున మెరుగపర్చాలనే లక్ష్యంతో రాష్ట్రంలో స్కిల్ సెన్సస్ (నైపుణ్య గణన)ను రాష్ట్ర మానవ వనరుల అభివృద్ది, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో చేపట్టడం జరిగిందన్నారు. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో చేపట్టిన ఈ వినూత్న గణన వల్ల సరైన వ్యక్తికి సరైన ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. రైతుల సంక్షేమార్థం వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర ఈ మధ్యకాలంలో పెంచడమే కాకుండా ఫసల్ భీమా యోజనా పథకాన్ని కేంద్రం ఎంతో సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

Read Also: CM Chandrababu: చరిత్ర తిరిగి రాయడానికి సిద్ధమయ్యం.. జెట్ స్పీడ్‌తో పనులు..

పేద, మధ్యతరగతి ప్రజల జీవనోపాధికి ఆసరాగా నిలిచేందుకై సామాజిక భద్రతా కార్యక్రమం అమల్లో భాగంగా ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకాన్ని పెద్ద ఎత్తున అమలుచేస్తూ దేశంలో 80 కోట్ల మందికి, రాష్ట్రంలో 2.70 కోట్ల మందికి ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ఉచితంగా ఆహార ధాన్యాలను పంపిణీ చేయడం జరుగుతోందన్నారు. నిరుపేదలకు శాశ్వత గృహవసతి కల్పనకై దేశంలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజనా పథకాన్ని అమలు చేయడం జరుగుతుందని, ఇప్పటికే ఈ పథకం క్రింద 4 కోట్ల గృహాలను పూర్తి చేయడం జరిగిందని, అదనంగా మరో 3 కోట్ల గృహాలను మంజూరు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించిందన్నారు. ఈ పథకం క్రింద రాష్ట్రానికి అత్యదిక మొత్తంలో 25 లక్షలను గృహాలను కేంద్ర మంజూరు చేసిందని, వాటి నిర్మాణం గత ఐదేళ్లలో ఎంతో మందకొడిగా సాగిందని, ప్రస్తుత ప్రభుత్వం వాటి నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ద చూపుతోందన్నారు. ప్రతి గృహాన్ని సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా మార్చాలనే లక్ష్యంతో పెద్ద ఎత్తున రాయితీలతో ప్రధాన మంత్రి సూర్య ఘర్ పథకాన్ని కేంద్రం అమలు చేస్తోందన్నారు. ఈ పథకం క్రింద ఉత్పత్తి అయ్యే అదనపు విద్యుత్ ద్వారా ఆదాయాన్ని సమకూర్చునే అవకాశాన్ని కూడా ప్రభుత్వం కల్పించిందన్నారు. ఈ పథకాన్ని రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉపయోగించుకునేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్ద ఎత్తున చొరవ చూపుతున్నారన్నారు.