NTV Telugu Site icon

KTR : మా మహిళా శాసనసభ్యులపైన అకారణంగా ముఖ్యమంత్రి నోరు పారేసుకున్నారు

Ktr

Ktr

మా మహిళా శాసనసభ్యులపైన అకారణంగా ముఖ్యమంత్రి నోరు పారేసుకున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. కేటీఆర్‌ అసెంబ్లీలో మీడియా పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడుతూ.. అక్కలను నమ్ముకుంటే బతుకు బస్టాండ్ అవుతుందని ముఖ్యమంత్రి నికృష్టంగా మాట్లాడారని, ఈ అవమానం కేవలం సబితక్కకు సున్నితక్కకు జరిగింది కాదు తెలంగాణ ఆడబిడ్డలు అందరి పట్ల జరిగిన అవమానమన్నారు. మహిళలను నమ్ముకుంటే బతుకు బస్టాండ్ అవుతుందని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడడం శోచనీయమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ముఖ్యమంత్రి అన్ఫిట్ ముఖ్యమంత్రి అని కేటీఆర్‌ విమర్శించారు. నోరు జారితే ఎవరైనా వెనక్కి తీసుకుంటారు కానీ కండకావరంతో ముఖ్యమంత్రి ఆడబిడ్డలను అవమానించారని, తెలంగాణ ఆడబిడ్డల ఉసురు తగుల్తదని ఆయన నిప్పులు చెరిగారు. మా ఇద్దరూ మహిళా నేతలు కష్టపడి ప్రజల మధ్యలో తిరిగి నేతలైన గొప్ప ఆడబిడ్డలు అని, ప్రజల దీవెనలు కార్యకర్తల ఆశీర్వాదంతో గెలిచి వచ్చినవాళ్లు అని కేటీఆర అన్నారు.

నీ లెక్క పార్టీలు మారి పదవులు తెచ్చుకున్న వాళ్ళు కారు… సీఎం గుర్తుంచుకోవాలని, ఇప్పటికైనా ముఖ్యమంత్రి సిగ్గు తెచ్చుకొని… బుద్ధి తెచ్చుకొని బేశరతుగా క్షమాపణ చెప్పాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. ఏ మొహం పెట్టుకుని వచ్చినవని ఉపముఖ్యమంత్రి అనడం అన్యాయమని, ఆడబిడ్డల గురించి అంత ధైర్యంగా మాట్లాడే అధికారం నీకు ఎవరు ఇచ్చిర్రు భట్టి గారు అని ఆయన వ్యాఖ్యానించారు. పదేళ్లు అధికారంలో ఉన్న ఏరోజైనా ఒక్కరోజైనా ఆడబిడ్డలను అవమానించామా అని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి గారిని ఏకవచనంతో మాట్లాడినము అని అభ్యంతరం చెప్తే వెంటనే మార్చుకున్నాం అది మాకు కేసీఆర్ నేర్పించిన సంస్కారమని, తెలంగాణ ఈరోజు మా ఆడబిడ్డలకు జరిగిన అవమానం మొత్తం తెలంగాణ ఆడబిడ్డలకు జరిగిన అవమానమన్నారు. ముఖ్యమంత్రి సిగ్గు బుద్ధి జ్ఞానం తెచ్చుకొని సంస్కరించుకో.. ఇకనైనా ముఖ్యమంత్రి సమయం ఎంతో వివరించకుంటే ఊరుకునేది లేదన్నారు. ఆడబిడ్డలను అడ్డగోలుగా మాట్లాడి ముఖ్యమంత్రి రేవంత్ పారిపోయారన్నారు.