KTR: తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో భూ కేటాయింపులు, టెసేరాక్ సంస్థ వ్యవహారం, ఓటర్ల జాబితా, వరుణ యాగం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా వంటి అంశాలపై కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కర్ణాటకలో మాజీ సీఎం సిద్ధరామయ్య కుటుంబానికి భూ కేటాయింపుల వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ తెలంగాణలో అంతకంటే ఎక్కువగా భూ కేటాయింపులు జరుగుతున్నాయని ఆరోపించారు.
టెసేరాక్ సంస్థకు అనుముల కొండల్రెడ్డి స్వయంగా చైర్మన్గా ప్రకటించుకున్నారని కేటీఆర్ ఆరోపించారు. సరిగ్గా చదువులు కూడా లేని కొందరు వ్యక్తులు కోట్లు విలువ చేసే సూట్లు వేసుకుని చైర్మన్లు అయ్యారని విమర్శించారు. ఒక్క ఉద్యోగి కూడా లేని కంపెనీని ఏర్పాటు చేసి, దాని మూలధనం కేవలం రూ.లక్ష మాత్రమేనని ఆరోపించారు. పఠాన్చెరులో కంపెనీ ఉన్నట్లు చూపిస్తున్నారని, అయితే అలాంటి సంస్థకు వేల కోట్ల విలువ చేసే భూమిని కేటాయించారని కేటీఆర్ విమర్శించారు. గజానికి రూ.7 వేల చొప్పున సుమారు రూ.200 కోట్ల విలువ చేసే భూమిని సీఎం రేవంత్రెడ్డి అప్పనంగా కట్టబెట్టారని ఆరోపించారు.
అయితే టెసేరాక్ కంపెనీకి సీఎం కుటుంబంతో ఎలాంటి సంబంధం లేదని మంత్రి శ్రీధర్బాబు చెబుతున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. తన శాఖలో జరుగుతున్న వ్యవహారాలపై మంత్రికి సమాచారం లేదా అని ప్రశ్నించారు. టెసేరాక్ సంస్థతో సంబంధం లేకపోతే అనుముల కొండల్రెడ్డిని చైర్మన్గా ఎందుకు ప్రకటించుకున్నారని ప్రశ్నించారు. అలాగే కొండల్రెడ్డి కుమారుడు ఆ సంస్థ తరఫున ఇంటర్వ్యూలు ఎందుకు ఇస్తున్నారని నిలదీశారు.
కర్ణాటకలో భూ కేటాయింపుల వ్యవహారంలో లోకాయుక్తను ఆశ్రయించిన తరహాలోనే తెలంగాణలోనూ ఈ వ్యవహారంపై పోరాటం చేస్తామని కేటీఆర్ తెలిపారు. కొండల్రెడ్డికి ఏమైనా ప్రత్యేక కేటగిరీ ఉందా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్కు చెందిన వారు కూడా రూ.లక్ష మూలధనంతో కంపెనీ ఏర్పాటు చేస్తే వారికి కూడా 5 ఎకరాల భూమి కేటాయిస్తారా.? అని కేటీఆర్ ప్రశ్నించారు. టెసేరాక్ పేరుతో రేవంత్రెడ్డి కుటుంబం వేల కోట్లను దోచుకుంటోందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.
మరోవైపు రాష్ట్రంలో 74 లక్షల ఓట్లు తొలగించే అవకాశం ఉందన్న ప్రచారంపై ఆందోళన వ్యక్తం చేసిన కేటీఆర్.. ఆగస్టు 17న ఓటర్ల జాబితా ప్రకటించనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ అప్రమత్తమైందన్నారు. జిల్లా కమిటీలతో ఇప్పటికే సమావేశాలు నిర్వహించామని, అర్హులైన ఓటర్ల ఓట్లు తొలగించకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై చర్చించామని తెలిపారు. ఈ నెల 13, 14 తేదీల్లో సమావేశం నిర్వహించాలని భావిస్తున్నామని, పార్టీ అధినేత కేసీఆర్తో చర్చించిన అనంతరం సమావేశాన్ని ఖరారు చేస్తామని కేటీఆర్ వెల్లడించారు. అర్హులైన ఓటర్ల ఓట్లు తొలగించకుండా చూడటమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
వరుణ యాగంపై కూడా కేటీఆర్ విమర్శలు చేశారు. చేయాల్సిన పనులు చేయకుండా ప్రజల దృష్టిని మళ్లించేందుకే యాగాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. వర్షాలు కురుస్తున్న సమయంలో వరుణ యాగం నిర్వహించారని, మరోవైపు పంపులు ఆన్ చేయాల్సిన సమయంలో వాటిని ఆన్ చేయడం లేదని విమర్శించారు. యాగాలు చేయడం తప్పు కాదని, అయితే ప్రభుత్వం చేయాల్సిన పనులను కూడా చేయాలని కేటీఆర్ అన్నారు. గురువుకు నీళ్లు వదిలి గురుదక్షిణ ఇవ్వకుండా ఉండొద్దని వ్యాఖ్యానిస్తూ.. వెంటనే కన్నెపల్లి పంప్హౌస్లో పంపులను ఆన్ చేయాలని డిమాండ్ చేశారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకపోవడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై కేటీఆర్ విమర్శలు చేశారు. తెలంగాణలో 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నప్పటికీ రాష్ట్రానికి ఏ ఒక్క ప్రాజెక్టుకూ జాతీయ హోదా తీసుకురాలేకపోయారని విమర్శించారు. ‘8 ప్లస్ 8 ఈక్వల్ టు జీరో’ అంటూ కాంగ్రెస్, బీజేపీ ఎంపీలపై సెటైర్ వేశారు. పార్లమెంట్లో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడం సాధ్యం కాదని కేంద్రం ప్రకటించిందని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడాలంటే బీఆర్ఎస్తోనే సాధ్యమని కేటీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తమ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.

