ఈరోజు, రేపు రెండు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో ధర్నాలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పిలుపునిచ్చారు. కేటీఆర్ పిలుపు నేపథ్యంలో ధర్నాలు, రాస్తారోకాలు, బైక్ ర్యాలీలు.. తదితర రూపాల్లో బీఆర్ఎస్ శ్రేణులు నిరసనలకు సిద్ధమవుతున్నాయి. ఈరోజు ఉదయం పార్టీ శ్రేణులతో కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ ధర్నాలకు పిలుపునిచ్చారు.
Also Read: Kaleshwaram Project: సీబీఐ దర్యాప్తు ఆపాలంటూ.. హైకోర్టును ఆశ్రయించిన కేసీఆర్, హరీష్రావు!
‘కాంగ్రెస్ పార్టీ కాలేశ్వరంపైన కుట్ర చేస్తున్నది. తెలంగాణ వరప్రదాయిని కాలేశ్వరం ప్రాజెక్టును శాశ్వతంగా మూసేసి.. నదీ జలాలను ఆంధ్రకు తరలించేందుకు సీఎం రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి చేస్తున్న ఈ కుట్రలను మనం ఎదుర్కోవాలి. ఇది కేసీఆర్ పైన చేస్తున్న కుట్ర మాత్రమే కాదు.. తెలంగాణ నదీ జలాలను పక్క రాష్ట్రాలకు తరలించి, కాలేశ్వరాన్ని ఎండబెట్టే ప్రయత్నంలో భాగంగానే జరుగుతున్నది. సీబీఐకి కాలేశ్వరం అప్పజెప్పడం అంటే పూర్తిగా ప్రాజెక్టును మూసేయడమే. నిన్నటిదాకా సీబీఐ పైన వ్యతిరేకంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి.. ఒక్కరోజులోనే మాట ఎందుకు మార్చాడు. దీని వెనుక ఉన్న శక్తులు, వాటి ఉద్దేశాలు ఏమిటో ప్రజలకు తెలియజెప్పాలి. ఇది కచ్చితంగా కాంగ్రెస్, బీజేపీ ఆడుతున్న నాటకం. కాంగ్రెస్ పార్టీ సీబీఐకి ఇచ్చినా లేదా ఏ ఏజెన్సీకి ఇచ్చినా భయపడేది లేదు. కేంద్రంతో కలిసి కాంగ్రెస్ చేస్తున్న కుట్రలను ఎదుర్కొంటాం. బెదిరింపులు, కేసులు మా పార్టీకి కొత్త కాదు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్ని పోరాటాలైనా, త్యాగాలైనా చేస్తాం’ అని కేటీఆర్ తెలిపారు.