జింబాబ్వే పర్యటనలో శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో టీమిండియా 3-0తో సిరీస్ గెలుచుకున్నప్పటికీ, కొంతమంది ఆటగాళ్ల తీరుపై మాజీ క్రికెటర్ అండ్ సెలెక్టర్ క్రిస్ శ్రీకాంత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా యువ బ్యాటర్ తిలక్ వర్మ ప్రదర్శనను ఆయన తీవ్రంగా విమర్శించారు. తిలక్ వర్మ మందకొడి బ్యాటింగ్ శైలి జట్టుపై ప్రతికూల ప్రభావం చూపుతోందని శ్రీకాంత్ అభిప్రాయపడ్డారు. ఆఖరి టీ20 మ్యాచ్లో తిలక్ 9 బంతుల్లో 11 రన్లు మాత్రమే చేశారని, పేస్ బౌలింగ్ను సరిగ్గా ఎదుర్కోలేకపోతున్నారని చెప్పారు. గతంలో ఇంగ్లాండ్ సిరీస్లో కూడా అతడి ప్రదర్శన స్థిరంగా లేదని పేర్కొన్నారు.
టీ20ల్లో ఆధిపత్యం చెలాయించాలంటే ఆర్సీబీకి రెండుసార్లు ఐపీఎల్ ట్రోఫీ అందించిన రజత్ పాటిదార్ను జట్టులోకి తీసుకోవాలని శ్రీకాంత్ సూచించారు. పాటిదార్ ప్రతిభ ముందు తిలక్ వర్మ ఏమాత్రం సరిపోడని ఆయన వ్యాఖ్యానించారు. తిలక్తో పాటు ఓపెనర్ అభిషేక్ శర్మ వైఫల్యాన్ని కూడా ఆయన ఎత్తిచూపారు. గత 10 ఇన్నింగ్స్ల్లో అభిషేక్ కేవలం 191 రన్లు మాత్రమే సాధించాడని గుర్తుచేస్తూ, అతని విషయంలో సెలెక్టర్లు కఠిన నిర్ణయం తీసుకోవాలని కోరారు.
అభిషేక్ శర్మ స్థానంలో సంజూ శాంసన్ను మళ్లీ టీ20 జట్టులోకి పిలవాలని శ్రీకాంత్ డిమాండ్ చేశారు. ప్రస్తుత భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్లు జట్టు ఎంపిక విషయంలో ఈ రకమైన కఠిన నిర్ణయాలు తీసుకోవాలని తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా శ్రీకాంత్ స్పష్టం చేశారు.

