వందేళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఓటమి భయం పట్టుకుందన్నారు బీజేపీ చేవెళ్ల అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి. వికారాబాద్ నియోజకవర్గంలోని పూడూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోదీకి వస్తున్న ఆదరణతో కాంగ్రెస్ నాయకులకు నిద్ర పట్టడం లేదని కొండా విశ్వేశ్వర్ రెడ్డి విమర్శించారు. ఉత్తరప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ ప్రభంజనం ముందు నిలబడలేకనే.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అమేథీ నియోజకవర్గం నుంచి పారిపోయారని ఆయన ఎద్దేవా చేశారు.
ఈసారి ఎన్నికల్లో హిందువులంతా ఏకమై భారతీయ జనతాపార్టీకి, నరేంద్ర మోదీకి పట్టం కట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అందుకే రాహుల్ గాంధీ ముస్లిం, మైనార్టీల ఓట్లు అధికంగా ఉన్న కేరళలోని వయనాడ్ కు పారిపోయాడని కొండా విశ్వేశ్వర్ రెడ్డి విమర్శించారు. చేవెళ్లలోనూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డి ముస్లిం ఓట్లను అడ్డం పెట్టుకొని గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా చేవెళ్ల గడ్డపై కాషాయ జెండాను ఎగురవేయడం ఖాయమని కొండా విశ్వేశ్వర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రచారం కార్యక్రమంలో వికారాబాద్ బీజేపీ నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి అనుచరులు పాల్గొన్నారు.
Botsa Jhansi: విశాఖను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రయత్నం చేస్తా..
రంగవల్లిలో పాల్గొన్న కొండా సంగీతారెడ్డి
మరోవైపు.. కొండా విశ్వేశ్వర్ రెడ్డి సతీమని సంగీతా రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. సోమవారం వికారాబాద్ పట్టణంలోని రాజీవ్ గృహకల్ప, రామయ్యగూడ ఎంఐజీ ప్రాంతాల్లో నిర్వహించిన ముగ్గుల కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతీ, సాంప్రదాయాలను కాపాడడంలో మహిళల పాత్ర అమూల్యమైనని అన్నారు. భారతదేశ గొప్పతనాన్ని ప్రపంచదేశాలకు చాటి చెప్పారని కొండా సంగీతా రెడ్డి తెలిపారు. భారతదేశాన్ని ప్రపంచదేశాలకు ఆదర్శంగా నిలుపుతున్న నరేంద్ర మోడీని మరోసారి ప్రధానిని చేయాల్సిన బాధ్యతన మనందరిపై ఉందని అన్నారు. ప్రపంచంలోని అగ్రరాజ్యాల అధినేతలు కూడా ఇవాళ నరేంద్ర మోడీని విశ్వగురుగా కీర్తిస్తున్నారని తెలిపారు. దేశాన్ని అభివృద్ధిపథంలో నడిపిచడానికి నరేంద్రమోడీని, చేవెళ్లను ప్రగతి మార్గంలో పయనించజేయడానికి కొండా విశ్వేశ్వర్ రెడ్డిని గెలిపించాలని కొండా సంగీతారెడ్డి కోరారు. మే 13న జరగనున్న పోలింగ్ లో మహిళంతా పెద్దసంఖ్యలో పాల్గొని కమలపువ్వు గుర్తుకు ఓటు వేసి కొండా విశ్వేశ్వర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కొండా సంగీతారెడ్డి తెలిపారు. ఆమె వెంట వికారాబాద్ బీజేపీ నేత మాధవరెడ్డి, పలువురు మహిళా మోర్చా నాయకురాళ్లు, కార్యకర్తలు ఉన్నారు.