తెలంగాణ కాంగ్రెస్లో గత రెండు, మూడు రోజులుగా చోటుచేసుకుంటున్న పరిణామాలు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి. మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తొలగిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాకు లేఖ పంపించారు. సీఎం నిర్ణయం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇకపై కొండా సురేఖ మంత్రిగా కొనసాగరని నోటిఫికేషన్లో పేర్కొంది. దీంతో తెలంగాణ రాజకీయాల్లో ఈ అంశం హాట్ టాపిక్గా మారింది.
తనను మంత్రి పదవి నుంచి తొలగించడంపై మాజీ మంత్రి కొండా సురేఖ మరోసారి స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. ఈ సందర్భంగా తన రాజకీయ భవిష్యత్పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘ఇక నిరీక్షణ ముగిసింది’ అంటూ తాజా సోషల్ మీడియా పోస్టులో కొండా సురేఖ పేర్కొన్నారు. అంతేకాకుండా అతి త్వరలోనే కీలక నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లు వెల్లడించారు. దీంతో కొండా తదుపరి నిర్ణయం ఏమిటన్న దానిపై తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. కొండా సురేఖ త్వరలో ప్రకటించనున్న కీలక నిర్ణయం ఏంటి?.. ఆమె రాజకీయంగా ఎలాంటి అడుగు వేయబోతున్నారు?.. అనే అంశాలపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. రాబోయే రోజుల్లో తెలంగాణ కాంగ్రెస్లో మరిన్ని రాజకీయ పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయి.

