Site icon NTV Telugu

Komatireddy Raj Gopal Reddy: తెలంగాణ సమాజం సహించదు.. సీఎం రేవంత్‌ వ్యాఖ్యలపై రాజగోపాల్‌రెడ్డి కౌంటర్‌!

Revanth Vs Raj Gopal

Revanth Vs Raj Gopal

సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి తప్పుపట్టారు. సోషల్ మీడియాపై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలకు రాజగోపాల్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. సామజిక బాధ్యతతో పనిచేసే వారిని గౌరవించాలని పేర్కొన్నారు. సోషల్ మీడియా జర్నలిస్టులను అనవానించడం సబబు కాదని సూచించారు. ఇలాంటి కుటిల పన్నాగాలను తెలంగాణ సమాజం సహించదని హెచ్చరించారు. నిబద్ధతతో పనిచేసే సోషల్ మీడియా జర్నలిస్టులకు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తెలిపారు.

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ట్విట్టర్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు. ‘ప్ర‌జ‌ల కోసం సామాజిక బాధ్య‌త‌తో ప‌నిచేస్తున్న సోష‌ల్ మీడియాను పాల‌కులు గౌర‌వించాలే త‌ప్ప‌.. అవ‌మానించ‌డం స‌బ‌బు కాదు. తెలంగాణ స‌మాజ‌ ఆకాంక్ష‌ల మేర‌కు సోష‌ల్ మీడియా మొద‌ట్నుంచి త‌న శ‌క్తి కొద్దీ ప‌నిచేస్తూనే ఉంది. నిబ‌ద్ద‌త‌తో ప‌నిచేసే సోష‌ల్ మీడియా జ‌ర్న‌లిస్టుల‌కు నా మ‌ద్ద‌తు ఎప్పుడూ ఉంటుంది. సోష‌ల్ మీడియా జ‌ర్న‌లిస్టుల‌ను దూరం పెట్టాలంటూ ప్ర‌ధాన మీడియా వారిని ఎగ‌దోయ‌డం ముమ్మాటికీ విభ‌జించి పాలించ‌డ‌మే. ఇలాంటి కుటిల ప‌న్నాగాల‌ను తెలంగాణ స‌మాజం స‌హించ‌దు’ అని రాజగోపాల్‌ రెడ్డి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌తో తెలంగాణ కాంగ్రెస్‌లో మరోసారి రాజకీయం ఆసక్తికరంగా మారింది.

Also Read: Chain Snatching: అప్‌డేట్ అయిన దుండగులు.. హైదరాబాద్‌లో కొత్తరకం చైన్ స్నాచింగ్!

ఇటీవల సీఎం రేవంత్‌ రెడ్డి ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ సోష‌ల్ మీడియా జ‌ర్న‌లిస్టుల‌పై మండిపడ్డారు. ‘జర్నలిజం డెఫినేషన్ మారింది. సోషల్ మీడియా పేరుతో జర్నలిజంలోకి వస్తున్న వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సోషల్ మీడియా జర్నలిస్టులను వేరే చేయాలి. ఈ రోజుల్లో మీడియా, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ఎవరు పడితే వాడు జర్నలిస్ట్ అని గొప్పలు చెప్పుకుంటున్నారు. పెన్ను పేపర్ ఇస్తే.. కొందరు ఏబీసీడీలు కూడా రాయలేరు. ఇటీవల నేను సోషల్ మీడియా జర్నలిస్ట్ అంటున్నారు. వారు జర్నలిజం స్కూల్‌లో చదివారా?, లేదా ఓనమాలు మొత్తం అయినా వస్తాయా?.. రెండూ రావు. రోడ్ల మీద తిరిగేటోడు, ఎక్కువ తిట్లొచ్చినోడు జర్నలిజం అనే ముసుగు తొడుక్కొని అందరి పట్ల అసహ్యకరమైన భాషను ఉపయోగించే పరిస్థితులు వచ్చాయి. జర్నలిజం ముసుగులో కొందరు ప్రెస్‌మీట్‌లు పెట్టినప్పుడు ముందలి వరుసలో కూర్చుంటారు. ఇంకా నమస్కారం పెడతలేవు, నన్ను చూసి ఇంకా తల వంచుకుంటలేవు అన్నట్లు చూస్తుంటాడు. స్టేజీ దిగి చెంపలు చెళ్లుమనిపించాలని నాకు అనిపిస్తది. కానీ పరిస్థితులు, హోదా నాకు అడ్డం వస్తుంది’ అని సీఎం రేవంత్‌ వ్యాఖ్యలు చేశారు.

Exit mobile version