Kishan Reddy letter to Sonia Gandhi: సోనియాగాంధీకి కేంద్ర మంత్రి కిషన్రెడ్డి బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ రైజింగ్ – 2047 పేరిట రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కార్యక్రమానికి సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి “తెలంగాణ రైజింగ్ – 2047 విజన్ డాక్యుమెంట్” పేరిట రూపొందించిన పుస్తకాన్ని ఇటీవల ఢిల్లీకి వచ్చి స్వయంగా సోనియాగాంధీకి అందించారు. ఈ సమయంలో 2 సంవత్సరాల పాలనలో ప్రభుత్వ పనితీరు, రాష్ట్ర అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉన్న దూరదృష్టిని అభినందించినట్లు, తెలంగాణ రైజింగ్ – 2047 విజన్ డాక్యుమెంట్ కు అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షిస్తూ ఆమె శుభాకాంక్షలు తెలిపారు. ఈ అంశంపై కిషన్రెడ్డి లేఖ రాశారు.
READ MORE: IND vs PAK: ట్రోఫీకి అడుగు దూరంలో భారత్.. ఆశలన్నీ ఆ యువ ప్లేయర్ పైనే..
లేఖ ప్రకారం.. 2023 లో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జరుగుతున్న సమయంలో 17సెప్టెంబర్, 2023 న హైదరాబాద్ నగర శివారులోని తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభకు విచ్చేసిన మీరు(సోనియా గాంధీ), అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభయహస్తం పేరిట కాంగ్రెస్ పార్టీ రూపొందించిన మేనిఫెస్టోను ఆవిష్కరించడమే కాకుండా స్వయంగా 6 గ్యారంటీలను అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని ప్రకటించారు. తదనంతరం జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిచి, అధికారం చేపట్టి 2 సంవత్సరాల పాలన పూర్తి చేసుకుంది. ఈ 2 సంవత్సరాల కాలంలో ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రజలకు మీరు, మీ కుటుంబ సభ్యులైన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మీ పార్టీ హామీ ఇచ్చి ఆవిష్కరించిన మేనిఫెస్టో అమలు గురించి కానీ, మీరు స్వయంగా ప్రకటించిన 6 గ్యారంటీల అమలు గురించి కానీ ఏనాడైనా తెలుసుకోవడానికి ప్రయత్నించారా? కనీసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మిమ్మల్ని కలిసిన సమయంలోనైనా వీటి అమలు గురించి అడిగి తెలుసుకున్నారా?
2 సంవత్సరాల పాలన పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రేవంత్ రెడ్డిని మీరు అభినందించారు. అంటే, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీల అమలు గురించి గానీ, 6 గ్యారంటీలు ప్రజలకు అందించారా లేదా అనే వాస్తవాలు గానీ మీకు తెలిసినట్లు లేదు.. తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించినట్లు కూడా లేదు. కానీ, ఇచ్చిన హామీలు వదిలివేసి తెలంగాణ ప్రజలను వంచిస్తూ, ప్రజలను మోసం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి పేరిట విజన్ డాక్యుమెంట్ తో కొత్త పల్లవి అందుకొని మీ పార్టీ, మీరు ఒకరినొకరు అభినందించుకుంటున్నారు. ఆనాడు ఎన్నికల సమయంలో మోసపూరిత హామీలు ఇచ్చి అధికారం చేపట్టిన మీరు, మళ్లీ ఇప్పుడు రాష్ట్రంలో విజన్ డాక్యుమెంట్ పేరిట కొత్త హామీలు ఇస్తున్నారు. మరి ఎన్నికలప్పుడు ఇచ్చిన గ్యారంటీలను గాలికొదిలేశారా? ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన 420 హామీలను మూసీ నదిలో కలిపేలేశారా? లేక గాంధీ భవన్ లో పాతరేశారా? తెలంగాణ ప్రజలకు తెలియజేయాలని పేర్కొన్నారు.