NTV Telugu Site icon

Kishan Reddy : అభూతకల్పన, అంకెల గారడి, ఆర్భాటం, సంతుష్టీకరణ తప్ప బడ్జెట్ లో ఏమి లేదు

G. Kishan Reddy

G. Kishan Reddy

అభూతకల్పన, అంకెల గారడి, ఆర్భాటం, సంతుష్టీకరణ తప్ప బడ్జెట్‌లో ఏమి లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బడ్జెట్‌లో కాంగ్రెస్​ ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం తప్ప.. ఏమీ కనిపించలేదు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నిటినీ తుంగలో తొక్కిందని, ప్రతి సంవత్సరం రైతులకు సీజన్​ ముందు ఇవ్వాల్సిన పంటపెట్టుబడి సాయం(రైతు బంధు/రైతు భరోసా)కు బడ్జెట్​ లో ఎలాంటి కేటాయింపులు చేయలేదన్నారు కిషన్‌ రెడ్డి. బడ్జెట్​ మొత్తంలో ఆసరా పెన్షన్‌ల ప్రస్తావనే లేదు. పెన్షన్లు పెంచుతామని మోసం చేశారని, మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు. కానీ బడ్జెట్‌లో మాత్రం ఆ ఊసే ఎత్తలేదన్నారు. దళిత సంక్షేమం కోసం కేటాయించాల్సిన బడ్జెట్ రూ.21,072 కోట్ల నుంచి.. రూ.7,638 కోట్లు తగ్గిపోయిందని, గిరిజన సంక్షేమం కోసం కేటాయించాల్సిన బడ్జెట్ రూ. 4,365 కోట్ల నుంచి.. రూ. 3,969 కోట్లకు తగ్గిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు.

అంతేకాకుండా..’ మొత్తం ప్రపంచం ఏమైపోయినా పర్వాలేదు. కానీ మైనారిటీల సంతుష్టీకరణ మాత్రమే మాకు కావాలనే కాంగ్రెస్ ఆలోచన మరోసారి ఈ బడ్జెట్లో మరోసారి బట్టబయలైంది. 2023-24లో రూ.2వేలుగా ఉన్న మైనార్టీ సంక్షేమ నిధులను.. ఈ బడ్జెట్ లో ఏకంగా రూ.3,003 కోట్లకు పెంచారు. అంటే ఒక్క ఏడాదిలోనే 30% ఈ కోటా బడ్జెట్ పెంచేశారు. మహిళలకు డ్వాక్రా రుణాలు అని ప్రస్తావించారు. అది ఇప్పటి వరకే ఉన్నది. కాలేజీకి వెళ్లే అమ్మాయిలకు స్కూటీలు అన్నారు దాని ఊసే లేదు. విద్యా నిధి పథకం కింద రూ.5 లక్షల సాయం అన్నారు.. దాని ప్రస్తావన లేదు. ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు.. అదీ లేదు. నిరుద్యోగులకు భృతి ఇస్తామని చెప్పి మోసం చేశారు. ఆర్టీసీ ఉచిత బస్సు పథకం ద్వారా రోడ్డున పడ్డ ఆటో డ్రైవర్లకు రూ.12 వేలు ఇస్తామని చెప్పి మోసం చేశారు. గత పదేండ్లలో బడ్జెట్​ లో సరిపోను నిధులు కేటాయించకపోవడంతో తెలంగాణలో విద్యా వ్యవస్థ మొత్తం విధ్వంసమైంది.

Off The Record: కేంద్రం, తెలంగాణ మధ్య బడ్జెట్ ప్రకంపనలు రేగుతున్నాయా..? |

దాన్ని బాగు చేయడానికి కనీసం 15 శాతం నిధులు విద్యారంగానికి కేటాయించాల్సి ఉండగా..7 శాతమే నిధులు కేటాయించింది. రాష్ట్రంలో ఆదాయం పెంచే మార్గాలేమిటో.. నిధులు ఎలా సమకూర్చుకుంటారో ప్రభుత్వం బడ్జెట్‌లో చూపించలేదు. గత సర్కారు చేసినట్టే.. ప్రభుత్వ భూములన్నీ అమ్మాలని చూస్తే తెలంగాణ ప్రజలు ఊరుకోరు. గత సర్కారు విచ్చలవిడిగా చేసిన అప్పులు కట్టేందుకు, కాంగ్రెస్​ ప్రకటించిన ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు మరిన్ని అప్పులు చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలపై ఇప్పటికే ఉన్న రుణభారాన్ని తగ్గించడం లేదు. పెంచుతున్నారు. గత ప్రభుతం తెచ్చిన దానికంటే 17 వేల కోట్లు ఎక్కువ అప్పు తెచ్చుకుంటామని ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రతిపాదించారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడంలో బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ రెండు పార్టీలు దొందు దొందే అని నిరూపితమైంది.’ అని కిషన్‌ రెడ్డి అన్నారు.