సాధారణంగా దేశాధినేతలు తమ కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తుంటారు. కానీ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ శైలే వేరుగా ఉంటుంది. ఆయన ఎక్కడికి వెళ్లినా తన కుమార్తెను వెంటబెట్టుకుని వెళ్తుంటారు. తాజాగా ఒక తుపాకుల ఫ్యాక్టరీని సందర్శించిన ఈ తండ్రీకూతుళ్లు.. అక్కడ పిస్టల్ పట్టి గురిచూసి కాల్పులు జరిపారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
అసలు ఏం జరిగింది?
ఉత్తర కొరియా ప్రభుత్వ మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. కిమ్ జోంగ్ ఉన్ తన 13 ఏళ్ల కుమార్తెతో కలిసి బుధవారం ఒక ఆయుధాల ఫ్యాక్టరీని సందర్శించారు. అక్కడ కొత్తగా తయారవుతున్న పిస్టళ్లను, ఇతర చిన్న రకం ఆయుధాలను ఆయన పరిశీలించారు. కేవలం చూడటమే కాకుండా, షూటింగ్ రేంజ్కు వెళ్లి స్వయంగా తుపాకీని పేల్చారు. ఆ కొత్త పిస్టల్ పనితీరు చాలా బాగుందని కిమ్ మెచ్చుకున్నారు.
Also Read:Nara Lokesh: ఏపీలో మరో ప్రాజెక్ట్ ప్రారంభించిన మంత్రి నారా లోకేష్.. అధిక సంఖ్యలో ఉద్యోగాలు..
ఈ పర్యటనలో కిమ్ కుమార్తె కిమ్ జూ ఏ కూడా తండ్రితో కలిసి గన్తో గురిచూసి కాల్పులు జరిపింది. మిలిటరీ అధికారుల మధ్యలో ఆమె ఎంతో ధైర్యంగా తుపాకీ పట్టుకుని ఉన్న ఫోటోలు బయటకు వచ్చాయి. కిమ్ తన కూతురిని చిన్నప్పటి నుంచే ఇలాంటి మిలిటరీ ఈవెంట్లకు, క్షిపణి ప్రయోగాలకు, ఫ్యాక్టరీల ప్రారంభోత్సవాలకు తీసుకువెళ్తున్నారు. రీసెంట్గా ఆమె ఒక స్నిపర్ రైఫిల్ను కూడా టెస్ట్ చేసినట్లు సమాచారం.
Also Read:House Tax: ఏందయ్యా ఇది.. ఇంటి పన్ను కట్టలేదని గ్యాస్ సిలిండర్ తీసుకెళ్లిన మున్సిపల్ సిబ్బంది..
చాలా కాలంగా కిమ్ జోంగ్ ఉన్ అణు ఆయుధాల మీద దృష్టి పెట్టారు. కానీ ఇప్పుడు సాధారణ సైనిక బలగాలను కూడా ఆధునీకరించాలని భావిస్తున్నారు. అందుకే ఈ ఫ్యాక్టరీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే.. కిమ్ తన కుమార్తెను పదేపదే ఇలాంటి కీలకమైన వేదికల మీదకు తీసుకురావడం వెనుక పెద్ద ప్లానే ఉందని నిపుణులు అంటున్నారు. తన తర్వాత తన కుటుంబం నుంచే నాలుగో తరం నాయకురాలిగా ఆమెను కిమ్ సిద్ధం చేస్తున్నారని దక్షిణ కొరియా నిపుణులు అంచనా వేస్తున్నారు. కేవలం తుపాకులే కాదు.. అంతకు ముందు రోజు వీరిద్దరూ కలిసి ఒక యుద్ధ నౌక నుంచి క్షిపణులను ప్రయోగించే దృశ్యాలను కూడా తిలకించారు.