TDP-Janasena: ఓ ప్రైవేట్ హోటల్లో జరిగిన టీడీపీ – జనసేన జేఏసీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక నుంచి ప్రతి 15 రోజులకోసారి జేఏసీ సమావేశాలు నిర్వహించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. వచ్చే జేఏసీ సమావేశం జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించాలని జేఏసీ నిర్ణయం తీసుకుంది.
ఈ నెల 14,15,16 తేదీల్లో నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమావేశాలు జరుగుతాయని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఉమ్మడి మేనిఫెస్టోను త్వరలోనే ఖరారు చేస్తామన్నారు. ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై రెండు పార్టీల ప్రతినిధులతో కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ నెల 13వ తేదీన ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ భేటీ కానుందని ఆయన చెప్పారు. కరవు వల్ల రైతులు పడుతున్న ఇబ్బందులు పడుతున్నారని.. రైతులకు కరవు సాయం.. ఇన్పుట్ సబ్సిడీ అందేలా ఉద్యమం చేపడతామన్నారు. పంటల బీమా వ్యవస్థను కూడా ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆయన విమర్శించారు. వివిధ సమస్యలపై ఉమ్మడిరర పోరాటాలు రూపొందించేలా కార్యక్రమాలు రూపొందించుకున్నామని ఈ సందర్భంగా చెప్పారు. వచ్చే శుక్ర, శనివారాల్లో రోడ్ల దుస్థితిపై ఉమ్మడి పోరాటం చేస్తామన్నారు. వివిధ వర్గాలకు అండగా నిలిచేలా కార్యక్రమాలు నిర్వహిస్తామని అచ్చెన్నాయుడు తెలిపారు.
Also Read: Minister Harish Rao: గంట లేట్ అయితే ఆయన ప్రాణానికే ప్రమాదం ఉండేది..
బీసీ సమస్యలు.. బీసీల దాడులపై రౌండ్ టేబుల్ సమావేశాల నిర్వహణకు నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ-జనసేన కార్యకర్తలపై పెట్టిన కేసుల్లో న్యాయ పోరాటానికి సిద్దమవుతున్నామన్నారు. స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసేశారని ఆయన మండిపడ్డారు. దిశా యాప్ ఓ బోగస్ యాప్ అని.. దిశా చట్టం లేకుండా దిశా యాప్ బలవంతంగా పెట్టి డౌన్ లోడ్లు చేయిస్తున్నారని మండిపడ్డారు. విజయనగరం జిల్లాలో ఆర్మీ ఉద్యోగిపై దిశా యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని పోలీసులే దాడి చేశారని ఆయన మండిపడ్డారు. ఇకపై ఎలాంటి రిప్రజెంటేషన్ ఇచ్చినా రెండు పార్టీలు కలిసే వెళ్తామన్నారు. యువత, నిరుద్యోగ సమస్యలపై ప్రత్యేకంగా ఫోకస్ పెడతామని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
జనసేన ఎన్డీఏలో మేం భాగస్వామిగా ఉన్నామని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. తెలంగాణలో మేం పోటీ చేయాలని చాలా కాలంగా భావిస్తున్నామన్నారు. ఆ మేరకు తెలంగాణ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.లోకేష్ పాదయాత్రపై దీపావళి తర్వాత నిర్ణయిస్తామన్నారు. చంద్రబాబు బెయిల్ విషయంలో మరింత క్లారిటీ వచ్చాక వివిధ ప్రాంతాల్లో ఉమ్మడి సభలు పెడతామన్నారు. ఆ ఉమ్మడి సభల్లో చంద్రబాబు – పవన్ పాల్గొంటారని వెల్లడించారు.